- ఆకస్మిక తనిఖీలతో హల్చల్
- ఉద్యోగ వాణి, యువవాణితో ప్రత్యేక ముద్ర
- యాదాద్రి కలెక్టర్గా హనుమంతరావుకు ఏడాది
యాదాద్రి, వెలుగు: యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు పాలనలో తనదైన ముద్ర వేశారు. ఆఫీసుకు మాత్రమే పరిమితం కాకుండా రోజులో కనీసం ఏడెనిమిది గంటలు ప్రజల మధ్యే తిరుగుతున్నారు. తనతో పాటు ఆఫీసర్లు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం.
యాదాద్రి జిల్లా ఐదో కలెక్టర్గా హనుమంతరావు నిరుడు అక్టోబర్లో బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి.. వారితో కలిసి పోయారు. ఎడ్యుకేషన్, వెల్ఫేర్, హెల్త్పై ప్రధానంగా దృష్టి సారించిన కలెక్టర్.. స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ను ఎక్కువగా విజిట్ చేస్తూ వాటిని గాడిలో పెడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలను సీరియస్గా తీసుకున్న ఆయన 100 శాతం రిజల్ట్స్ సాధించాలని ఆదేశించారు.
సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర స్టడీలో వీక్గా ఉన్న విషయం తెలుసుకుని అతన్ని కలెక్టర్ అడాప్ట్ చేసుకున్నారు. అతనిపై ప్రత్యేక శ్రద్ద పెట్టడంతో మంచి మార్కులతో పాసై పై చదువులకు వెళ్లాడు. అతడు స్థిరపడే వరకు ప్రతి నెల రూ. 5 వేల సాయం ప్రకటించారు. కలెక్టర్ కృషితో గత ఏడాది విద్యలో జిల్లా ముందు నిలిచింది.
గురువారం ఉద్యోగవాణి
సోమవారంతో పాటు గురువారం కూడా ప్రజలను దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రతి గురువారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటున్నారు. తాజాగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగవాణి నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలను తీర్చేందుకు పల్లె నిద్ర చేపట్టిన కలెక్టర్.. గ్రామసభలో వచ్చిన ఫిర్యాదులపై అప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులు పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు.
నవంబర్లో రెండు కొత్త ప్రోగ్రామ్స్
వచ్చే నెల నుంచి కలెక్టర్ హనుమంతరావు రెండు కొత్త ప్రోగ్రామ్స్ చేపట్టనున్నారు. సీనియర్ సిటిజన్స్కోసం నెలలో ఒకరోజు కేటాయించనున్నారు. ఇందులో భూ సమస్యలు, పింఛన్ల వంటి సమస్యలు కాకుండా వారి ఆరోగ్యం, పోషణ తదితర అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రతినెల రెండవ లేదా మూడవ ఆదివారం నాడు యువవాణి ప్రోగ్రామ్ చేపట్టనున్నారు. డిగ్రీ ఆపై చదివిన వారితో భేటీ అయి.. ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ, ఉపాధి అంశాలపూ మాట్లాడడంతో పాటు నిపుణులతో అవగాహన కల్పించనున్నారు.
అమ్మకు భరోసా
జిల్లాలోని స్కూల్స్, హస్టళ్లను ఆకస్మికంగా విజిట్ చేస్తున్నారు. హస్టళ్లలో కొత్త మెనూ అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించినా వారిపై యాక్షన్ తీసుకుంటున్నారు.హాస్టల్స్లో కలెక్టర్తో సహా ఆఫీసర్లంతా ఒకరోజు నిద్రిస్తున్నారు. జిల్లాలోని 82 హాస్టల్స్లో ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు.
జిల్లాలో విధులకు డుమ్మా కొడుతున్న డాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నారు. సిజేరియన్ల సంఖ్యను తగ్గించడానికి గర్భిణీల కోసం అమ్మకు భరోసా పేరుతో ఇటీవల కార్యక్రమం చేపట్టారు. ప్రతీ నెలలో డెలివరీ అయ్యే గర్భిణీలను గుర్తించి వారందరికీ న్యూట్రీషియన్ కిట్స్ అందిస్తున్నారు.
