ఎంఎల్​ఎస్​ పాయింట్లలో ఇన్​చార్జీల చేతివాటం .. 380 క్వింటాళ్ల రైస్​ మాయం

ఎంఎల్​ఎస్​ పాయింట్లలో ఇన్​చార్జీల చేతివాటం .. 380 క్వింటాళ్ల రైస్​ మాయం
  • రెండు చోట్ల రూ.20 లక్షల విలువైన.. 380 క్వింటాళ్ల రైస్​ మాయం
  • కారకులైన ఇద్దరిపై వేటు
  •  రికవరీ కోసం చర్యలు

యాదాద్రి, వెలుగు : సివిల్ సప్లయ్ డిపార్ట్​మెంట్​లో కొందరు ఇన్​చార్జీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎంఎల్​ఎస్​ పాయింట్ల నుంచి పీడీఎస్​ బియ్యం మాయమైంది. ఇందుకు కారకులైన ఇద్దరిపై వేటు వేశారు. యాదాద్రి జిల్లాలో భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్​, మోత్కూరు, రామన్నపేటలో ఒక్కొక్కటి చొప్పున 5 ఎంఎల్​ఎస్​పాయింట్లు ఉన్నాయి. రైస్ మిల్లుల నుంచి సేకరించే సీఎంఆర్​ప్రభుత్వ గోడౌన్లకు, అక్కడి నుంచి ఎంఎల్​ఎస్ పాయింట్లకు బియ్యం చేరుతోంది. ఈ పాయింట్ల నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడానికి ప్రతినెలా 4,400 టన్నులు రవాణా జరుగుతోంది. పంపిణీ చేయగా మిగిలిన స్టాక్​తోపాటు అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడిన బియ్యం కూడా ఈ పాయింట్లలోనే నిల్వ చేస్తారు. 

బస్తాలు లెక్కించకుండా నెట్..

ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యం నెట్ వేయించడంలోనే ఇన్​చార్జీలు తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎంఎల్ఎస్​ పాయింట్​కు వచ్చిన బియ్యం బస్తాలను హమాలీలతో బాంబే స్టాకింగ్ పద్దతిలో ఒక వరుస అడ్డం, మరో వరుస నిలువుగా పేరుస్తూ నెట్ వేయించాల్సి ఉంటుంది. ఇలా నెట్ వేయిస్తేనే బియ్యం బస్తాలు ఎన్ని ఉన్నాయో ఈజీగా లెక్కించవచ్చు. కానీ ఇక్కడే కొందరు ఇన్​చార్జిలు మొదటి వరుస సరిగా వేయిస్తూ.. రెండో వరుస నుంచి ఇష్టం వచ్చినట్టుగా నెట్ వేయిస్తున్నారు. అనంతరం చేతివాటం ప్రదర్శించి బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. ముందువరుసలో బియ్యం బస్తాలు సరిగా ఉండడం వల్ల చేతివాటం ప్రదర్శించినా లెక్కలు బయటపడడం లేదు. 

ప్రతినెలా వెరిఫికేషన్..​

రూల్స్ ప్రకారం ఎంఎల్ఎస్​ పాయింట్లలో ప్రతినెలా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. దీని కోసం డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, సివిల్ సప్లయ్​డీఎం, డీఎస్​వో, తహసీల్దార్ ఎంఎల్ఎస్​ పాయింట్లలో ప్రతి నెలా బియ్యం స్టాక్​చెక్​ చేసి హెడ్​ఆఫీస్​కు రిపోర్ట్ పంపించాలి. అయితే గోడౌన్​ ఇన్​చార్జిలు మనవారే కదా.. అనుకున్నారేమో ఇటీవల ఆ పని చేయడం లేదు. దీంతో భువనగిరి, ఆలేరు ఎంఎల్ఎస్​ పాయింట్ల ఇన్​చార్జీలు చేతివాటం ప్రదర్శించి బియ్యం పక్కదారి పట్టించారు.

భువనగిరిలో 200 క్వింటాళ్లు..

భువనగిరిలోని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్​చార్జి రాజు 200 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టించారు. గోడౌన్​కు వెళ్లిన ఆఫీసర్లకు బియ్యం బస్తాలు అడ్డదిడ్డంగాఉండడంతో వాటిని బాంబే స్టాకింగ్ పద్దతిలో నెట్​ వేయించారు. అనంతరం బియ్యం లెక్కించగా 200 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్టుగా తేలింది. ఇందులో దొడ్డు బియ్యంతోపాటు సన్న బియ్యం కూడా తక్కువగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆయనను వెంటనే సస్పెండ్ చేసి మరొకరిని ఇన్​చార్జిగా నియమించారు. 

ఆలేరులో 180 క్వింటాళ్లు..

ఆలేరు ఎంఎల్ఎస్​పాయింట్​ఇన్​చార్జి అచ్చయ్యను ఇటీవల చౌటుప్పల్​కు బదిలీ చేశారు. రామన్నపేటకు చెందిన కుసుమకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సమయంలో సీజ్ రైస్ 180 క్వింటాళ్లు తక్కువగా ఉండడంతో తాను సర్దుబాటు చేస్తానని అచ్చయ్య హామీ ఇచ్చారు. విషయం బయటపడడంతో అచ్చయ్యపై చర్యలు తీసుకొని బాధ్యతల నుంచి తప్పించారు. అయితే అచ్చయ్య హౌసింగ్​డిపార్ట్​మెంట్ నుంచి రావడంతో బియ్యం గోల్​మాల్​కు సంబంధించిన విషయాన్ని మాతృ సంస్థకు రిపోర్ట్ పంపించారు.

డబ్బు రికవరీ ఎలా..?

రెండు ఎంఎల్ఎస్​ పాయింట్ల నుంచి మాయమైన బియ్యం విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని ఆఫీసర్లు లెక్కించారు. భువనగిరిలో సస్పెండ్ అయిన రాజు, తమ డిపార్ట్​మెంట్​కు చెందిన వ్యక్తి కావడంతో అతడి జీతం నుంచి రూ.10 లక్షలు రికవరీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ఆలేరులో ఇన్​చార్జిగా చేసిన అచ్చయ్య హౌసింగ్ డిపార్ట్​మెంట్ నుంచి రావడంతో డబ్బు రికవరీ కోసం డిపార్ట్​మెంట్​కు రిపోర్ట్​ పంపించారు. అయితే రూ.10 లక్షలు అచ్చయ్య జీతం నుంచి రికవరీ చేస్తారా..? లేదా పూర్తిగా ఒకేసారి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారా..? అన్నది తేలాల్సి ఉంది.