యూరియా వచ్చేసింది.. జిల్లాకు చేరుకున్న 500 టన్నుల యూరియా

యూరియా వచ్చేసింది.. జిల్లాకు చేరుకున్న 500 టన్నుల యూరియా
  • షాపులకు వంద టన్నులు, పీఏసీఎస్​లకు 400 టన్నుల పంపిణీ 

యాదాద్రి, వెలుగు: యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాకు యూరియా చేరుకుంటోంది. వచ్చిన స్టాక్​కు వచ్చినట్టే పీఏసీఎస్​లు, షాపులకు తరలిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్ పంటల సాగు కోసం మొత్తంగా 32,830 టన్నులు అవసరం పడుతుందని అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ లెక్కలు వేసింది. వానాకాలం సీజన్​ మొత్తంలో జులై, ఆగస్టు నెలల్లోనే యూరియా వాడకం  ఎక్కువగా ఉంటోంది.

అయితే గడిచిన సీజన్​కు సంబంధించిన 6302 టన్నుల యూరియా స్టాక్​ ఉండడంతో ఇంకా 26,528 టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. అయితే అవసరమైన మేరకు యూరియా సప్లయ్​ కాలేదు. అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ ఇండెంట్​ ప్రకారం ఆగస్టు వరకూ 29,546.52 టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఆగస్టు నెలాఖరు వరకూ ఇప్పటివరకూ 18,769 టన్నుల యూరియా మాత్రమే రావడంతో 10,777 టన్నుల కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్​.. సప్లయ్​కు మధ్య అంతరం ఏర్పడింది. ఈ పరిణామంతో జిల్లాలో యూరియా కొనుగోలు చేయడానికి రైతులు లైన్లు కడుతున్నారు. 

తాజాగా 500 టన్నులు

యూరియా కోసం రైతులు క్యూ కడుతూ ఉండడంతో కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో బుధవారం 500 టన్నుల యూరియా జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గోడౌన్​కు వచ్చింది. యూరియాలో పీఏసీఎస్​లకు 400 టన్నులు, డీలర్లకు వంద టన్నుల యూరియాను అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ కేటాయించింది. గురువారం మరో 500 టన్నుల యూరియా వస్తుందని ఆఫీసర్లు తెలిపారు. 

జిల్లా         యూరియా ఇండెంట్​    ఇప్పటి వరకూ వచ్చిన     రావాల్సింది
యాదాద్రి    32,830                                          19,269                          13,561

కొరత లేకుండా చర్యలు

యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన స్థాయిలో స్టాక్​ ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాం. తక్కువ రేటున్న నానో యూరియా వాడాలని కూడా సూచిస్తున్నాం. ఎవరైనా యూరియా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం.  హనుమంతరావు, కలెక్టర్​, యాదాద్రి