సర్కారు కాలేజీలోనే చేరండి .. స్టూడెంట్ల ఇంటికెళ్లి లెక్చరర్ల క్యాంపెయిన్​

సర్కారు కాలేజీలోనే చేరండి .. స్టూడెంట్ల ఇంటికెళ్లి లెక్చరర్ల క్యాంపెయిన్​
  • ప్రైవేట్ కాలేజీల  తరహాలో ప్రచారం
  • 2 వేల అడ్మిషన్ల టార్గెట్ 

యాదాద్రి, వెలుగు: ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు లెక్చరర్లు నడుం బిగించారు. రెగ్యులర్,  కాంట్రాక్ట్​ లెక్చరర్లు అడ్మిషన్ల వేటలో పడ్డారు. 'రండి.. ప్రభుత్వ కాలేజీల్లోనే చేరండి..' అంటూ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. గతంలో  ప్రైవేట్​ కాలేజీల యాజమాన్యాలు ఏజెంట్లను నియమించుకొని ఇలా ప్రచారం చేసేవి. పేరెంట్స్​కు ఫోన్లు చేసి.. ఇండ్లకు వెళ్లి అడ్మిషన్లు కోరేవారు. ప్రొఫెషనల్​ కోర్సుల్లో చేరేందుకు  ఇంటర్​మార్కులే కీలకం కావడంతో పేరెంట్స్​ ఎక్కువగా కార్పొరేట్​ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా  ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో  అడ్మిషన్లు బాగా తగ్గిపోయాయి. దీంతో లెక్చరర్లు విద్యార్థుల ఇంటిబాట పట్టి .. తమ కాలేజీలో చేరాలని కోరుతున్నారు.  

యాదాద్రి జిల్లాలో  11 గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. ఫస్టియర్ , సెకండియర్​ కలిపి దాదాపు 3వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీల్లో చదువుతుండగా.. రెగ్యులర్, కాంట్రాక్ట్​లెక్చరర్లు కలిపి 132 మంది పని చేస్తున్నారు. గతంలో లెక్చరర్ల కొరత ఉండడం వల్ల ప్రభుత్వ కాలేజీల్లో పాస్​పర్సంటేజీ తక్కువగా ఉండేది. ఈసారి  ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు 60 శాతానికి మించి పాసయ్యారు.  సంస్థాన్​ నారాయణపురంలోని సర్వేల్​ గురుకులంలో  148 మంది సెకండియర్ స్టూడెంట్స్​ఎగ్జామ్​ రాస్తే అందరూ  పాస్​ అయ్యారు. ఫస్టియర్​లో   162 మందికి గాను 150 మంది పాస్​ అయ్యారు.  మిగతా కాలేజీల్లోనూ ఉత్తీర్ణత గతంలో కన్నా మెరుగయ్యింది.  గతంలోకన్నా ఉత్తీర్ణత పెరిగిందని,  తమ కాలేజీల్లోనూ మంచి మార్కులు సాధిస్తున్నారని   లెక్చరర్లు తల్లిదండ్రులకు నచ్చచెప్తున్నారు.  

జిల్లాలోని 11 గవర్నమెంట్​ ఇంటర్​ కాలేజీల్లో 1600 మంది సెకండియర్​ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్టియర్ లో అడ్మిషన్లు పెంచేందుకు  లెక్చరర్లు పూనుకున్నారు.  ఫస్టియర్​లో కనీసం రెండు వేల మందిని చేర్చుకోవాలని టార్గట్​గా పెట్టుకున్నారు.   టెన్త్​ పాస్​ అయిన స్టూడెంట్ల తల్లిదండ్రుల  ఫోన్​నెంబర్లు తీసుకొని మాట్లాడుతున్నారు.  అడ్రసులు తీసుకుని నేరుగా స్టూడెంట్ల ఇంటికి  వెళ్లి తమ కాలేజీలో చేరాలని కోరుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న వసతులు, ఇక్కడ చదవడంవల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ  ప్రింట్​ చేయించిన కరపత్రాలను పంచుతున్నారు.  

రిజల్ట్​ మంచిగా వచ్చింది

ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో  అన్ని అర్హతలు ఉన్న  లెక్చరర్లు ఉన్నారు. ప్రైవేట్​ కాలేజీల కంటే మంచి బోధన జరుగుతోంది. అందుకే ఈసారి గతంలో కన్నా మంచి రిజల్ట్ వచ్చింది. స్టూడెంట్స్​ ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని కోరుతూ వారి ఇండ్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నం.

రమణి, ఇంటర్​ నోడల్​​ ఆఫీసర్​, యాదాద్రి