
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ,కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు తారా స్థాయికి చేరాయి. బీజేపీ సీనియర్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్పపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా తీవ్ర ఆరోపణలు చేశారు. యడ్యురప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అగ్ర నేతలకు రూ. 1800 కోట్ల ముడుపులు ఇచ్చారని ఆరోపించారు. యడ్యురప్ప ఎవరెవరీకి ఎన్ని కోట్లు ఇచ్చారో తన డైరీ (యోడ్డీ డైరీస్)లో రాసుకున్నారని ఆయన చెప్పారు. ఈ డైరీ 2017 నుంచి ఐటీ దగ్గర ఉందని తెలిపారు. బీజేపీ సెంట్రల్ కమిటీకి రూ.1000 కోట్లు, ఆర్థిక మంత్రి జైట్లీకి రూ. 150 కోట్లు, నితిన్ గడ్కరీకి రూ.150 కోట్లు, హోంమంత్రి రాజ్నాథ్కు రూ.100 కోట్లు, అద్వాణీ, జోషీలకు చెరో రూ. 50 కోట్లు ఇచ్చినట్లు యడ్డీ తన డెయిరీలో రాసుకున్నారని ఆరోపించారు. ద కరవాన్ అనే పత్రికలో ఈ విషయంపై ఓ కథనం వచ్చిందని ఆయన అన్నారు. వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు.