సైబర్ నేరగాళ్ల మోసానికి అడ్డు అదుపులేకుండా పోతోంది. మాయమాటలు చెప్తూ..అందినకాడికి దోచుకెళ్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ యోగా ట్రైనర్ను చీట్ చేశారు మోసగాళ్లు. ఫోన్లో మాయమాటలు చెప్పి..ఆన్ లైన్లో డబ్బులు దోచేశారు.
20 నిమిషాల్లో లక్ష స్వాహా...
సుధా స్వర్ణకర్ అనే యోగా ట్రైనర్ కు జులై15వ తేదీన ఓ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. పంకజ్ కుమార్ పాండే అనే పేరుతో ఓ వ్యక్తి సుధా స్వర్ణకర్ కు కాల్ చేశాడు. తాను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేస్తున్నానని..లక్నో కంటోన్మెంట్ ఏరియాలోని బీఎస్ఎఫ్ రెండు నెలల పాటు యోగా శిభిరాన్ని నిర్వహించనుందని చెప్పారు. ఈ యోగా శిబిరంలో పాల్గొనేందుకు సుధా స్వర్ణకర్ ను నియమించుకుంటామని ఆమెతో చెప్పాడు.
లింక్ పంపాడు..మనీ దోచేశాడు..
తన నియామకానికి సంబంధించి కొంత నగదును డిపాజిట్ రూపంలో కట్టాల్సిందిగా సుధా స్వర్ణకర్ ను పంకజ్ కుమార్ పాండే కోరాడు. ఇందుకు తన బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన పేటీఎం ఖాతాకు మనీ పంపించాలని చెప్పాడు. అందుకోసం ముందుగా తన పేటీఎం నుంచి 2 రూపాయాలను పంపుతానంటూ ..ఆ లింక్ ద్వారా ఫీజు చెల్లించాలని సుధా స్వర్ణకర్ కు సూచించాడు. అయితే రూ. 2 చెల్లింపు ఫెయిల్ అయిదంటూ..మళ్లీ మళ్లీ లింక్స్ ను పంపాడు సైబర్ కేటుగాడు. చీటర్ పంపిన లింక్స్ ను పలు మార్లు ఓపన్ చేసింది సుధా స్వర్ణకర్. అయితే కొద్దిసేపటికి తన ఖాతా నుంచి రూ. 94,998 డెబిట్ అయినట్లు గుర్తించింది. మోసపోయానని గ్రహించిన సుధా స్వర్ణకర్..పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సైబర్ నేరగాడి మాయలో పడి రూ. 94,998 కోల్పోయిన సుధా స్వర్ణకర్..యూపీలోని అషియానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ చేపట్టారు. అయితే సైబర్ నేరగాడి మొబైల్ ఫోన్ నెంబర్ ఇప్పటికీ యాక్టీవ్ లోనే ఉందని..వాడు పదే పదే కాల్ చేస్తున్నాడని..బాధితురాలు తెలిపింది.