స్టేట్ బ్యాంక్ ఛైర్మన్ రజ్ నీష్ కుమార్
వాల్యుయేషన్ దాదాపు 3 లక్షల కోట్లు?
పార్టనర్స్తో చర్చలు సాగుతున్నాయి
యోనోకి 2.6 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లు
టాప్ 5 మొబైల్ బ్యాంకింగ్ యాప్స్లో యోనో
న్యూఢిల్లీ: యోనో డిజిటల్ ప్లాట్ఫామ్ను సెపరేట్ సబ్సిడరీగా ఏర్పాటు చేయాలని చూస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజ్నీష్ కుమార్ చెప్పారు. ‘యు ఓన్లీ నీడ్ వన్ యాప్’(యోనో) పేరుతో ఎస్బీఐ ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ను 2017 నవంబర్లో లాంఛ్ చేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన అన్ని ట్రాన్సాక్షన్స్ను ఒకే అప్లికేషన్ ద్వారా చేసుకునేలా దీన్ని రూపొందించింది. ‘యోనోను సెపరేట్ సబ్సిడరీగా మార్చేందుకు మా పార్టనర్స్తో మేము చర్చలు జరుపుతున్నాం’ అని రజ్నీష్ కుమార్ యాన్యువల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్–సిబోస్ 2020లో చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ను సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్సియల్ టెలికమ్యూనికేషన్(స్విఫ్ట్) నిర్వహించింది. యోనో ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పడిన తర్వాత.. ఎస్బీఐ కూడా దీని యూజర్లలో ఒకటిగా మారనుందని పేర్కొన్నారు. చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని, యోనో వాల్యుయేషన్ ప్రక్రియ పెండింగ్లో ఉందని చెప్పారు. ఇటీవలే యోనో వాల్యుయేషన్ సుమారు 40 బిలియన్ డాలర్లుగా ఉంటుందని కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇతర స్టార్టప్ల వాల్యుయేషన్తో పోలిస్తే.. యోనో వాల్యుయేషన్ 40 బిలియన్ డాలర్ల కంటే తక్కువేమీ ఉండదు.. అయితే ఇప్పటి వరకు ఎలాంటి వాల్యుయేషన్ ఎక్సర్సైజ్ను తాము చేపట్టలేదని చెప్పారు. స్వతంత్ర సంస్థగా ఏర్పడిన తర్వాత.. సర్వీసులు కేవలం ట్రాన్స్ఫర్స్ లేదా లెండింగ్కే పరిమితం కాకుండా.. బీటూబీ ప్రొడక్ట్ను కూడా అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. అంటే చిన్న వ్యాపారులు తమ బిల్లులో భారీ డిస్కౌంట్లు పొందేలా రూపొందించనున్నామని, ప్రస్తుతం ఎస్బీఐ పే లేదా కార్డ్స్ బిజినెస్ ఇస్తున్న వాటి కంటే ఎక్కువగానే ఆఫర్ చేయనున్నామని పేర్కొన్నారు. గత మూడేళ్ల క్రితం లాంఛ్ అయిన యోనో యాప్కి 26 మిలియన్ రిజిస్టర్ యూజర్లున్నారు. రోజుకు 5.5 మిలియన్ లాగిన్స్ రికార్డవుతున్నాయి. రోజుకు 4 వేలకు పైగా పర్సనల్ లోన్స్ జారీ జరుగుతోంది. 16 వేల మంది యోనో కృషి అగ్రి గోల్డ్ లోన్స్ తీసుకున్నారు. మొబైల్ అప్లికేషన్ అండ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ను ఒక సెపరేట్ సబ్సిడరీగా ఏర్పాటు చేస్తోన్న మొదటి బ్యాంక్ ఎస్బీఐనే కావడం విశేషం.
కొత్తగా న్యూ అంబ్రెల్లా ఎంటిటీ..
రిటైల్ పేమెంట్స్ కోసం న్యూ అంబ్రెల్లా ఎంటిటీ(ఎన్యూఈ) ఫ్రేమ్వర్క్ కింద డిజిటల్ పేమెంట్స్ ఎంటిటీని కూడా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నామని రజ్నీష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్లో ఆర్బీఐ రిటైల్ పేమెంట్స్ కోసం ఈ ఫ్రేమ్వర్క్ను తెచ్చింది. అప్లికేషన్ చివరి తేదీగా 2021 ఫిబ్రవరి 26గా ఆర్బీఐ పేర్కొంది. ‘మేము దీన్ని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకున్నాం. దేశంలో పేమెంట్ స్పేస్లో అతిపెద్ద ప్లేయర్గా ఎస్బీఐ నేచురల్గానే ఈ ప్రాసెస్ను నడిపించగలదు. వచ్చే కొన్ని నెలల్లో అంటే ఆర్బీఐ ఇచ్చిన గడువు 2021 ఫిబ్రవరి కంటే ముందే డిజిటల్ పేమెంట్స్ ఎంటిటీని ఏర్పాటు చేస్తాం’ అని కుమార్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక్క రిటైల్ పేమెంట్ కంపెనీ ఎన్పీసీఐ ఉంది. ఈ సెగ్మెంట్లోకి మరింత మందిని ఆహ్వానించి కాంపిటీషన్, ఇన్నోవేషన్ పెంచాలని ఆర్బీఐ చూస్తోందని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో పేమెంట్ సిస్టమ్ లబ్ది పొందేలా చూడాలనుకుంటుందన్నారు. కరోనా మహమ్మారితో డిజిటలైజేషన్, కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ అవసరం పెరిగిందని కుమార్ చెప్పారు. బ్రాంచ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని తెలిపారు. చాలా మంది డిజిటల్ వైపుకే మరలారని పేర్కొన్నారు. 100 ట్రాన్సాక్షన్స్లో కేవలం ఏడు మాత్రమే బ్యాంక్ బ్రాంచ్ల వద్ద జరుగుతున్నాయని, ఏటీఎం ట్రాన్సాక్షన్ పర్సంటేజ్ కూడా గత మూడేళ్లలో 55 శాతం నుంచి 29 శాతానికి తగ్గిందని చెప్పారు. మొత్తం ట్రాన్సాక్షన్స్లో మొబైల్ ట్రాన్సాక్షన్స్ 55 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు.
బ్యాంకులకు ఖర్చులు తగ్గుతాయ్!
చాలా బ్యాంక్లు ఇప్పుడు క్రాస్ సెల్లింగ్ ఫైనాన్సియల్ ప్రొడక్ట్ల కోసం మొబైల్ బ్యాంకింగ్ రూట్ను వాడుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో, బ్యాంక్ తన యోనో మార్కెట్ప్లేస్ ద్వారా రూ.46.2 కోట్ల విలువైన ప్రొడక్ట్లను విక్రయించింది. ‘ప్రస్తుతం కన్జూమర్ డేటా, అకౌంట్ డేటా ఆధారంగా డైరెక్ట్గా యాప్ ద్వారా ప్రీ అప్రూవ్డ్ లోన్స్ను జారీ చేస్తున్నాం. దీంతో ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తున్నాం. 2.7 కోట్ల యోనో యూజర్లలో 30 శాతం మంది ఎస్బీఐ బారోవర్స్గా ఉన్నారు’ అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి అన్నారు. డిజిటల్ క్రాస్ సెల్లింగ్కు సాయం చేసే మొబైల్ బ్యాంకింగ్ యాప్స్తో బ్యాంక్ ఖర్చులు తగ్గుతాయని శాన్ఫోర్డ్ సీ బెర్న్స్టయిన్ లోని ఇండియా ఫైనాన్సియల్ అండ్ ఎమర్జింగ్ ఫిన్టెక్ డైరెక్టర్ గౌతమ్ చుగానీ అన్నారు.