- ఏపీలో దొంగ ఓట్లపై.. పోటాపోటీగా కంప్లైంట్స్
- ఈసీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ
న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. మాక్ ప్రాక్టీస్ అంశంపై అధికార వైఎస్సార్ సీపీ, దొంగ ఓట్లపై విపక్ష పార్టీలు బీజేపీ, టీడీపీలు పోటాపోటీగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఫిర్యాదు చేశాయి. తొలుత పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు. పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నదని కంప్లైట్ చేశారు. ‘మై పార్టీ డ్యాష్బోర్డ్ డాట్ కామ్’ పేరిట ఆ పార్టీ వెబ్సైట్ కుట్రల్ని... సెక్షన్ 123(3) పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్ట్ను ఉల్లఘిస్తున్న విషయానికి సంబంధించిన విషయాన్ని ఈసీఐకి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్ప్రాక్టీస్పై అనేక అంశాల్ని కమిషన్తో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు.
అధికార పార్టీయే కంప్లైట్ చేయడం దురదృష్టకరం: కనక మేడల
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సాఆర్ సీపీ ఎంపీలే ఈసీఐకి కంప్లైట్ చేయడం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తామిచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈనెల 22న రాష్ట్రానికి వస్తామని ఈసీఐ ఉన్నతాధికారులు చెప్పారన్నారు.
దొంగ ఓట్లపై ఆధారాలు ఇచ్చాం: పురందేశ్వరి
ఏపీలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ఆమె నేతృత్వంలో ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, ముఖ్య నేతలు సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు. తర్వాత పురందేశ్వరి మాట్లాడారు. ఏపీ ఓటర్ల లిస్ట్ లో గందరగోళం నెలకొన్నదన్నారు.