
టీమిండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే పాటించే క్రమశిక్షణ గురుంచి చెప్పాలంటే మాటల్లో వర్ణించలేం. ఎంత పెద్ద ఆటగాడైనా, ఆఖరికి భారత జట్టు కెప్టెన్ అయినా తన ముందు క్రమశిక్షణ తప్పితే ఏమాత్రం సహించరు. ఈ వైఖరే అతనికి, విరాట్ కోహ్లీకి మధ్య వివాదానికి కారణమైంది. అటు మీదట ఈ విషయంపై భారత ఆటగాళ్ల నుండి ఫిర్యాదులు ఎక్కువ అవడంతో కుంబ్లేని ఆ బాధ్యతల నుంచి తప్పించారు కూడానూ.
పోనీ కుంబ్లే ఇప్పుడైనా శాంతించారా! అదీ కనిపించడం లేదు. కుంబ్లే పేరు వినపడగానే టీమిండియా మాజీ ఆటగాళ్ళైన యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ భయపడిపోతున్నారు. ప్రస్తుతం ఇండియా - వెస్టిండీస్ టెస్టు సిరీస్కి కామెంటేటర్గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే గురించి ఇషాంత్ శర్మ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.
కోచ్గా కుంబ్లేతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గురించి మాట్లాడిన ఇషాంత్ శర్మ.. "అనిల్ భాయ్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆయన డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నా, కామెంటరీ బాక్సులో ఉన్నా ఒకేలా(చాలా సీరియస్) ఉంటారు.." అని కామెంట్ చేశారు. అందుకు బదులిచ్చిన కుంబ్లే.. నేను చాలా మంచోడిని, యువీ, ఇషాంత్ నాపై కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు నమ్మకండి అని చెప్పుకొచ్చారు.
"ఇషాంత్ శర్మ, యువరాజ్ సింగ్ ఇద్దరూ నా గురించి లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. నేను మరీ అంత కఠినంగా వ్యవహరించను. ఈ మధ్యనే యువరాజ్, సచిన్ టెండూల్కర్లను కలిశాను. యువీకి ఇదే చెప్పాను. నేను చాలా సరదా మనిషిని. అయితే ఫీల్డ్లో కాస్త కఠినంగా ఉంటాను. ప్లేయర్ల నుంచి మంచి ఫలితాలు రాబట్టాలంటే ఆమాత్రం ఉండాలి. సీరియస్గానే చెప్పాలి. కానీ మైదానం బయట మాత్రం అలా ఉండను.." అని కుంబ్లే తెలిపారు.
కాగా, కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంలో కుంబ్లే హస్తం కూడా ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. తనకు జరిగిన అవమానాన్ని గంగూలీ(అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు) సహాయంతో బదులు తీర్చుకున్నాడన్నది దాని సారాంశం.