జోనల్​ టెండర్లపై కేసు

 జోనల్​ టెండర్లపై కేసు
  •  జోనల్​ టెండర్లపై కేసు 
  • అంగన్​వాడీలకు అందని గుడ్లు
  • ఈ ఏడాది జనవరి నుంచే  కొత్త పద్ధతికి గ్రీన్​సిగ్నల్​
  • హైకోర్టుకు వెళ్లిన కాంట్రాక్టర్లు 
  • బడా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనని ఆరోపణలు

మంచిర్యాల, వెలుగు : రాష్ట్రంలోని   అంగన్​వాడీ సెంటర్లకు గుడ్లు సరఫరా చేసేందుకు నిర్వహించిన జోనల్​టెండర్ల అంశం హైకోర్టుకు చేరింది. గతంలో జిల్లా స్థాయిలో ఉన్న గుడ్ల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసి జోనల్ టెండర్లు పిలిచింది. కొత్త టెండర్ల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు కోడిగుడ్లు​ సప్లై చేయడానికి కాంట్రాక్టర్లకు ఆర్డర్స్​ఇచ్చింది. కొంతమంది పాత కాంట్రాక్టర్లు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. బడా కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఉన్న ఈ జోనల్​టెండర్​సిస్టం రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. ఈ కేసుపై హైకోర్టు స్టే విధించడంతో కొత్త టెండర్లకు టెంపరరీగా బ్రేక్​ పడింది. ప్రస్తుతం పాత కాంట్రాక్టర్లే గుడ్లు సరఫరా చేస్తున్నా సక్రమంగా అందడం లేదని అంగన్​వాడీ టీచర్లు చెబుతున్నారు.  

ఇప్పటివరకు ఇలా.... 

అంగన్​వాడీ సెంటర్ల ద్వారా ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారులైన గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంలో భాగంగా రోజుకో గుడ్డును అందిస్తున్నారు. ఇందుకు అవసరమైన ఎగ్స్ సప్లై చేసేందుకు ఇప్పటివరకు జిల్లాస్థాయిలో జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో) టెండర్లు నిర్వహిస్తున్నారు. ఐసీడీఎస్​ ప్రాజెక్టుల వారీగా పౌల్ర్టీ నిర్వాహకుల నుంచి టెండర్లు స్వీకరించి ట్రాన్స్​పోర్టేషన్​ రేటు తక్కువకు కోట్​చేసిన వాళ్లకు అప్పగిస్తున్నారు. గుడ్డుకు ఆ రోజు ఉన్న నెక్ రేటు చెల్లిస్తున్నారు. నెలలో 5, 15, 25 తేదీల్లోపు మూడుసార్లు ఎగ్స్​సప్లై చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తున్నారు. 45 నుంచి 52 గ్రాముల బరువు  కాకుండా చిన్నసైజు గుడ్లను సప్లై చేస్తున్నారు. అగ్​మార్క్​ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోవడం, క్వాలిటీ లేకపోవడంతో కుళ్లిన గుడ్లు వచ్చిన సందర్భాలు అనేకం. కాంట్రాక్టర్లపై ఇలాంటి ఎన్నో ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు.  

జోనల్​ టెండర్లతో చెక్​ పడేనా..? 

జిల్లాస్థాయి టెండర్లలోని లోపాలకు చెక్​పెట్టడంతో పాటు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్లకు అగ్​మార్క్​ ప్రమాణాల మేరకు క్వాలిటీ ఎగ్స్​అందించేందుకే జోనల్​టెండర్​విధానాన్ని ప్రవేశపెట్టినట్టు విమెన్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​డిపార్ట్​మెంట్ చెబుతోంది. ప్రస్తుతం పాలు, కందిపప్పు సప్లై కోసం స్టేట్​లెవల్​టెండర్లు నిర్వహిస్తున్నారు. చాలా ఏండ్ల నుంచి ఈ టెండర్​ను దక్కించుకుంటున్న సంస్థ సబ్​కాంట్రాక్టర్ల ద్వారా సప్లై చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ రెండు సరుకులు సక్రమంగా సప్లై కావడం లేదని, క్వాలిటీ ఉండట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎగ్స్​జోనల్​టెండర్ల విధానం కూడా ఇందుకు భిన్నంగా ఉండబోదని అంటున్నారు. కొత్త విధానంలో పలుకుబడి కలిగిన బడా కాంట్రాక్టర్లను నియంత్రించేది ఎవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

రెండేండ్ల కాలపరిమితితో..

నిరుడు నవంబర్​లో జోన్ల వారీగా టెండర్లు పిలిచి డిసెంబర్​లో బిడ్స్​ఓపెన్​ చేసి కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి 2024 డిసెంబర్​ వరకు రెండేళ్ల కాలపరిమితితో టెండర్లు అప్పగించారు. రాష్ట్రంలో ఏడు జోన్లు ఉండగా, కాళేశ్వరం జోన్​ 8.95 కోట్లు, బాసర 14.97 కోట్లు, రాజన్న 13.44 కోట్లు, భద్రాద్రి 15.46 కోట్లు, యాదాద్రి 8.95 కోట్లు, చార్మినార్ 20.39 కోట్లు, జోగులాంబ జోన్​ 12.71 కోట్ల గుడ్లు సప్లై చేయాల్సి ఉంది. మొత్తంగా 94.25 కోట్ల గుడ్లను చేరవేయాలి. గుడ్డు అగ్​మార్క్​ప్రమాణాల ప్రకారం 45–52 గ్రాముల బరువుండాలి. కాంట్రాక్టర్లు సొంత పౌల్ర్టీ ఫామ్​ కలిగి టెండర్​లో పేర్కొన్న మొత్తంలో 40 శాతం ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి. మిగతా 60 శాతం గుడ్లను ఇతర పౌల్ర్టీఫామ్​ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, బడా కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసమే జోనల్​టెండర్​విధానాన్ని తీసుకొచ్చారని, దీనిని రద్దు చేసి పాత పద్ధతినే కొసాగించాలని పలువురు పాత కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని పాత, కొత్త కాంట్రాక్టర్లు, అధికారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.