భైంసాకు చేరుకున్న రైతుల పాదయాత్ర

భైంసాకు చేరుకున్న రైతుల పాదయాత్ర
  • సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​
  • సబ్​ కలెక్టర్​కు వినతి

భైంసా, వెలుగు:  సోయా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని భారత కిసాన్​ సమితి ఆధ్వర్యంలో రెండ్రోజుల క్రితం చేపట్టిన రైతుల పాదయాత్ర సక్సెస్​ అయ్యింది. మంగళవారం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ముథోల్​మీదుగా భైంసా వరకు 32 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం 
నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని భారత కిసాన్​సమితి సభ్యులు పేర్కొన్నారు. 

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పరివాహాక ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో పత్తి, సోయా, వరి, ఇతర పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. పంట నష్టం సర్వే చేసిన ప్రభుత్వం ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. భైంసాకు చేరుకున్న రైతులు నేరుగా సబ్ ​కలెక్టర్​కార్యాలయానికి వెళ్లి సబ్​ కలెక్టర్​ సంకేత్​ కుమార్​కు తమ సమస్యలు విన్నవించారు. 

సోయా కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని, అసలైన రైతులకు మాత్రమే టోకెన్లు ఇవ్వాలని కోరారు. స్పందించిన సబ్​ కలెక్టర్​త్వరలోనే కేంద్రాలు ఓపెన్​చేస్తామని, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీచ్చారు. అంతకు ముందు రైతుల పాదయాత్రకు బీజేపీ మండల అధ్యక్షురాలు సుష్మారెడ్డి, పలువురు నాయకులు మద్దతు తెలిపారు.