సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు:  సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ముసురు వర్షాలు కురుస్తుండడంతో  వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు వైద్యశాఖ అధికారులు, వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు.

సీజనల్ వ్యాధుల నివారణ కు పంచాయతీరాజ్, వాటర్ సప్లై, మున్సిపల్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికకు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పెద్ద పెద్ద భవనాలను కూల్చివేసేందుకు యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. లేనిపక్షంలో మున్సిపల్ అధికారులే వాటిని కూల్చి వేయించాలన్నారు. సమావేశంలో డీఈవో గోవిందరాజులు, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, డీపీఓ భిక్షపతి, డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఓ సుధాకర్, నారాయణపేట, మక్తల్, మద్దూర్, మున్సిపల్ కమిషనర్లు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.