- క్రెడిట్ కార్డు హోల్డర్స్ టార్గెట్ గా మోసాలు
- ఢిల్లీ, ఉజ్జయిని అడ్డాగా ఫ్రాడ్
- 16 మంది అరెస్ట్.. పరారీలో ఏడుగురు
- రూ.15 లక్షల క్యాష్, వెయ్యి సిమ్ కార్డులు సీజ్
హైదరాబాద్,వెలుగు: ఢిల్లీ, ఉజ్జయిని అడ్డాగా సాగుతున్న ఫేక్ కాల్ సెంటర్స్ దందాను సైబరాబాద్ పోలీసులు ట్రేస్ చేశారు. 22 మంది సభ్యుల గ్యాంగ్ లో16 మందిని అరెస్ట్ చేశారు. రూ.15లక్షల క్యాష్, వెయ్యి సిమ్ కార్డులు, 865 ఫేక్ ఆధార్ ,పాన్, ఓటర్ ఐడీ కార్డులు , మూడు కార్లు,బైక్,చెక్బుక్స్,రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఉత్తమ్నగర్కి చెందిన దీపక్ చౌదరి, విశాల్కుమార్ బ్యాంకింక్ సెక్టార్లో థర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వహించేవారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో మోసాలకు స్కెచ్ వేశారు . ఢిల్లీలోని మోహన్ గార్డెన్స్, ఉత్తమ్నగర్, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మొత్తం 6 కాల్సెంటర్స్ ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న అనుభవంతో ఆర్బీఎల్ బ్యాంక్కి చెందిన క్రెడిట్ కార్డ్ హోల్డర్లను టార్గెట్ చేశారు.
కస్టమర్ల పేరు, సెల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్తో పాటు కార్డుకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేశారు. కస్టమర్లకు కాల్ చేసేందుకు స్పూఫింగ్ కాల్ యాప్స్(ఎమ్ఓ ఎస్ఐపి, సిల్వర్ డైలర్)ఉపయోగించారు. ఆర్బీఎల్ కొత్త క్రెడిట్ కార్డ్స్ డెలివరీ అయిన వారిని ట్రాప్ చేసేవారు. కార్డ్ యాక్టివేషన్,ఇన్సూరెన్స్ డీ యాక్టివేషన్, క్రెడిట్ లిమిట్ పెంచుతామని నమ్మించేవారు. ఓటీపీ పంపించి క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. క్రెడిట్ కార్డ్ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు 6 వెబ్సైట్స్,3 మర్చంట్స్ పేమెంట్ గేట్వేస్ రిజిస్టర్ చేసుకున్నారు. కస్టమర్ల నుంచి కొట్టేసిన క్యాష్ను పేమెంట్ గేట్వే ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. రెండేండ్లుగా మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్పై దేశవ్యాప్తంగా 166 కేసులు నమోదు కాగా.. సైబరాబాద్ పరిధిలో 34 కేసులు రిజిస్టర్ అయ్యాయి.
ఢిల్లీ, ద్వారకలో పోలీస్ రైడ్స్
గచ్చిబౌలిలోని వ్యక్తికి అక్టోబర్లో ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ వచ్చింది. తర్వాత అతడికి ఓ కాల్ వచ్చింది. ఆర్బీఎల్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పిన సదరు వ్యక్తులు పిన్ నంబర్ జనరేట్, రూ.24 వేల ఇన్సూరెన్స్ను డీ యాక్టివేట్ చేస్తామని నమ్మించారు. బాధితుడి మొబైల్ నంబర్కి ఓటీపి పంపించారు. దాన్ని రీసెండ్ చేయించుకుని రూ.97,996 కొట్టేశారు. బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్కు కంప్లయింట్ చేశాడు. పేమెంట్ గేట్వే ,బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెబ్సైట్స్, పోర్టల్ అడ్రస్తో ఢిల్లీ ద్వారకలో రైడ్స్ చేశారు. దీపక్తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉత్తమ్నగర్, ఉజ్జయినిలోని కాల్సెంటర్స్ గుర్తించారు. అక్కడ రైడ్స్ చేసి 16 మందిని అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉండగా.. ఈ గ్యాంగ్ మొత్తం రూ.3కోట్లకు పైగా కొట్టేసినట్లు గుర్తించారు.