ఎయిర్టెల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ 5G హైప్పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. 5G నెట్వర్క్ గొప్ప ప్రచారానికి (హైప్) తగ్గట్టుగా లేదు అని అన్నారు.
5G గురించి చేసిన ప్రచారం (హైప్)లోని ఉత్సాహం రియల్ టైంలో కనిపించలేదు. అలాగే 5G మార్కెట్లో చెప్పినంతగా పెద్ద మార్పులు కూడా తీసుకురాలేకపోయింది. వ్యాపార విధానాలను మార్చడం లేదా కంపెనీల ఆదాయాన్ని పెంచడం వంటివి అస్సలు చేయలేదు, నిజానికి టెలికాం కంపెనీలు 5G నుండి ఇదే ఆశించారు.
గోపాల్ విట్టల్ కంపెనీ ఆదాయాల గురించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టెలికాం రంగంలో ఒక ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, 5G అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదు. 5G ముఖ్య ఉపయోగం కేవలం స్పీడ్ మాత్రమే. ఇది ఎక్కువ డేటాను అందించడానికి మెరుగైన, సమర్థవంతమైన మార్గం. కానీ, ప్రపంచంలో ఇది ఎక్కడా డబ్బు సంపాదించడానికి దారితీయలేదు.
టెలికాం కంపెనీలు కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టినా, 5G ద్వారా డబ్బు సంపాదించడానికి గొప్ప మార్గాలను కనుగొనలేకపోయాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, రిమోట్ సర్జరీ, ఫాస్టెస్ట్, నమ్మకమైన కమ్యూనికేషన్స్ వంటివి 5G ద్వారా వస్తాయన్న కొత్త సర్వీసులు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు లేదా ప్రజల్లోకి వెళ్లలేదు.
5G పేరు చెప్పి రీఛార్జ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల రేట్లను పెంచడం ద్వారా మాత్రమే టెలికాం కంపెనీలు డబ్బు సంపాదించగలిగాయి. 'స్లైసింగ్' వంటి కొన్ని కొత్త ప్రయోగాలు అమెరికా (US) వంటి దేశాలలో జరిగినా, అవి చాలా చిన్నవి, ఆదాయంలో పెద్ద మార్పు తీసుకురాలేవు అని విట్టల్ అన్నారు.
4G తో పోలిస్తే 5G చాలా వేగంగా ఉన్నా, డేటాను సమర్థవంతంగా అందించినా ప్రజలకు కనిపించే ఒకేఒక్క ప్రయోజనం స్పీడ్ మాత్రమే. టెలికాం కంపెనీలకు ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటాను అందించడానికి సహాయపడుతుంది, కానీ కొత్త సర్వీసులకు, అదనంగా గొప్ప ఆదాయానికి దారితీయలేదు.
