రామగిరి ఖిల్లా రోప్ వేకు లైన్ క్లియర్.. ఫలించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి

రామగిరి ఖిల్లా రోప్ వేకు లైన్ క్లియర్.. ఫలించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి
  • నిర్మాణానికి కేంద్రం అప్రూవల్
  • పర్వత మాల ప్రాజెక్ట్ కింద మంజూరు
  •     2.4 కిలోమీటర్లు నిర్మాణం 
  •     అక్టోబర్ 21 వరకు బిడ్స్ స్వీకరణ 
  •     ఎన్ హెచ్​ఎల్​ఎంఎల్​ కు బాధ్యతలు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని సెగ్మెంట్ లోని చారిత్రక రామగిరి ఖిల్లాకు రోప్ వే నిర్మాణానికి కేంద్రం లైన్​క్లియర్​చేసింది. పర్వతమాల ప్రాజెక్టు కింద రామగిరి ఖిల్లాకు రోప్​వే ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పలుమార్లు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి నాలుగు రోప్​వేల మంజూరు అయ్యాయి. 

అందులో భాగంగా రామగిరి ఖిల్లాకు కూడా మంజూరు చేసింది. 2. 4 కిలోమీటర్లు రోప్​వే నిర్మాణం కానుంది. దీని బాధ్యతలను నేషనల్​హైవేస్​లాజిస్టిక్​మేనేజ్​మెంట్​లిమిటెడ్​కు అప్పగించినట్లు ఎన్ హెచ్ఏఐ( నేషనల్​హైవే అథారిటీ ఆఫ్​ఇండియా) పేర్కొంది.  అక్టోబర్​21 వరకు  డీపీఆర్​తో  బిడ్స్​ సమర్పించాలని తెలిపింది. 

టూరిస్ట్​ స్పాట్​ చేసేందుకు రాష్ట్రం నిధులు 

ఇప్పటికే రాష్ట్ర సర్కార్  ఖిల్లా చుట్టూ రోడ్ల నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేసింది. ఖిల్లాకు అనుసంధానంగా స్టేట్, నేషనల్​హైవేలు నిర్మాణాలు కొనసాగున్నాయి.  ఖిల్లాను టూరిస్ట్ స్పాట్ గా చేసేందుకు అధికారులు అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలు, కోట చరిత్ర, ప్రాముఖ్యత వంటి అంశాలపై ఆరా తీశారు. ఖిల్లాపైన ఉన్న శిల్పకళ, ప్రకృతి సోయగాలపైనా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రామగిరి, మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్​మండలాలు ఖిల్లాకు సమీపంలో ఉంటాయి. ఖిల్లాను డెవలప్​చేయడం ద్వారా పెద్దపల్లి జిల్లా టూరిస్ట్​స్పాట్​గా మారనుంది.

ఖిల్లా కేంద్రంగా డెవలప్ మెంట్​ ప్రోగ్రామ్స్​ 

రామగిరి ఖిల్లా కేంద్రంగా  డెవలప్​మెంటు ప్రోగ్రామ్స్​ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారి-63 రామగిరి మండలంలోని పలు గ్రామాల మీదుగా ముత్తారం కేంద్రంగా వరంగల్​వైపు నిర్మాణంలో  ఉంది. పెద్దపల్లి నుంచి కునారం వ్యవసాయ కేంద్రం మీదుగా ముత్తారం నుంచి భూపాలపల్లి వైపు మరో రాష్ట్ర రహదారి నిర్మాణం జరుగనుంది. ప్రధానమంత్రి సడక్​ యోజన కింద అమ్రాబాద్ నుంచి ముత్తారం మండలం పారుపల్లి వరకు ఇంకో రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. 

ముత్తారం మండలంలో రెండు బ్రిడ్జీలను ఒక్కోటి రూ. 2.50 కోట్లతో నిర్మించనున్నారు. వీటన్నింటిపై ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో మాట్లాడారు. నిర్మాణంలోని రోడ్లు, బ్రిడ్జిలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆయా రోడ్లన్నీ రామగిరి ఖిల్లాకు సమీపం నుంచే వెళ్తుండగా.. రామగిరి భవిష్యత్​లో ప్రాధాన్యం పెరుగనుంది.