
- తెలంగాణలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఏర్పాటు చేస్తాం
- ఢిల్లీలో సీఎం రేవంత్ను కోరిన సినీ నటుడు అజయ్ దేవగణ్
- తెలంగాణ రైజింగ్కు ప్రచారకర్తగా ఉంటానని హామీ
- రేవంత్తో భేటీ అయిన కపిల్ దేవ్.. క్రీడా రంగం అభివృద్ధిపై ప్రశంసలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డిని అజయ్ దేవగణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలను అజయ్ దేవగణ్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్కు సంబంధించి మీడియా, సినీ రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని రేవంత్ రెడ్డికి అజయ్ దేవగణ్ తెలియజేశారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధిలోభాగస్వామిని అవుతానన్న కపిల్ దేవ్
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో కపిల్ దేవ్ సోమవారం కలిశారు. దాదాపు అర గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కపిల్ దేవ్ కు సీఎం వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఆలోచనలపై ఆసక్తి కనబరిచిన కపిల్ దేవ్.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో తాను భాగస్వామినవుతానని అన్నారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో తాము సందర్శించిన క్రీడా యూనివర్సిటీలు.. అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను సీఎంతో పంచుకున్నారు.