చదివినప్పుడు నేర్చుకున్న విషయాల గురించి ఇంకా బాగా తెలియాలంటే... ప్రాక్టీస్ అయినా చేయాలి లేదా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే దానిగురించి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అలా మొదలైందే ఇతని జర్నీ కూడా. సైన్స్ స్టూడెంట్ అయిన అశుతోష్ జోషికి మూవీ డైరెక్షన్ అంటే ప్యాషన్. దానికోసం ఇంగ్లండ్లో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసి ఇండియా వచ్చాడు. డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ కోసం రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నాడు. దానికోసం బ్యాగ్ వేసుకొని నడవడం మొదలుపెట్టాడు.
అశుతోష్ సొంతూరు మహారాష్ట్రలోని నర్వాన్. రైతులకు అవేర్నెస్ ఇవ్వాలని, వాళ్ల సమస్యలు తెలుసుకొని దానిపైన డాక్యుమెంట్ తీయాలని ఎప్పటినుంచో అనుకునేవాడు. అలా ఏప్రిల్ 10న తన ఊరు నర్వాన్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు. 72 రోజుల ఈ యాత్రలో మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 1,850 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చేరుకొని యాత్ర ముగించాడు ఈ పాతికేండ్ల కుర్రాడు.
ఊరి పెద్దల సాయంతో..
చిన్న ట్రాలీ తయారుచేసుకున్నాడు. దానిపైన 45 కిలోల మూడు బ్యాగ్స్, ఒక కెమెరా, టెంట్ పెట్టుకుని నడక యాత్ర మొదలుపెట్టాడు అశుతోష్. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో వచ్చే గ్రామాలకు వెళ్లి అక్కడి రైతులు, స్టూడెంట్స్ని కలిసేవాడు. ప్లాస్టిక్ వాడటం తగ్గించాలని, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు చెప్పాడు. నీళ్ల ఇంపార్టెన్స్ చెప్తూ రాబోయే వర్షాకాలంలో ప్రతీ నీటిచుక్క వేస్ట్ కాకుండా చూడాలని, అలా చేస్తే గ్రౌండ్ వాటర్ పెరిగి నీటి కరువు రాదని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాడు. రైతులతో మాట్లాడాడు. వాళ్ల సమస్యలు తెలుసుకొని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని వేడుకున్నాడు. అంతేకాకుండా టీవీ, ప్రొజెక్టర్ స్క్రీన్స్ పెట్టించి వాళ్లకి అర్థం అయ్యేలాగ ఎక్స్పర్ట్స్తో మాట్లాడించాడు. అశుతోష్ గురించి తెలుసుకున్న గ్రామ పెద్దలు, సర్పంచ్లు, పోలీస్లు వాళ్ల ఊళ్లకు పిలిపించి మరీ రైతులతో మీటింగ్స్ పెట్టించారు. సన్మానాలు కూడా చేశారు.
‘ఇన్ని రోజుల జర్నీలో నేను రకరకాల మనుషుల్ని కలిసాను. వాళ్లని కలిసిన ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకున్నా. పర్యావరణం విషయంలో ప్రతీ ఒక్కరు బాధ్యతగా ఉండాలని వివరించా. ఈ ప్రయాణంలో నాకు ఎదురైన ఎక్స్పీరియెన్స్తో రైతులకు ఉపయోగపడే డాక్యుమెంటరీ తీస్తా. నాకు నడక అంటే ఇష్టం. అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇలా ప్లాన్ చేశా. వేరే ప్రాంతాలకు వెళ్లి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నా’ అని చెప్పాడు అశుతోష్.