- సోలార్ రూఫ్ నుంచి కరెంటు తయారీ
- ఏడాదికి 3.50 లక్షల యూనిట్ల కెపాసిటీ
హైదరాబాద్, వెలుగు:విశాక గ్రూపునకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) స్టార్టప్ ఆటుమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ తమ బైకుల తయారీ కెపాసిటీని పెంచడానికి రెడీ అయింది. ఇందుకోసం పటాన్చెరులో నిర్మించిన రెండో ఫ్యాక్టరీని గ్రూప్ చైర్మన్ గడ్డం వివేకానంద్ దంపతులు, ఆటుమొబైల్ ఫౌండర్ గడ్డం వంశీ శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ బైకుల తయారీకి పూర్తిగా క్లీన్ఎనర్జీ (నెట్ జీరో తయారీ) వాడుతారు. ఇందుకోసం ఫ్యాక్టరీ పైకప్పును సోలార్ ప్యానెల్స్తో తయారు చేశారు. ఈ రెండు యూనిట్లలో ఏటా 3.50 లక్షల బైకులను తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఆటమ్ 1.0 కెఫే రేసర్ స్టైల్ ఎలక్ట్రిక్ బైకులని తయారు చేస్తున్నారు. హై-స్పీడ్ మోడల్స్ కూడా ఇక్కడే తయారు కాబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇవి మార్కెట్కు వస్తాయి. ఈ స్టార్టప్ పటాన్చెరులో తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని 2020 సంవత్సరంలో 25 వేల యూనిట్ల కెపాసిటీతో మొదలుపెట్టింది. 20 వేల చదరపు అడుగులకి పైగా విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ద్వారా 300 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ “క్లీన్ ఎనర్జీతో ఈవీలను తయారు చేయడం వల్ల ఇండియా పర్యావరణం పట్ల బాధ్యత గల దేశంగా ఎదుగుతుంది. అందుకే మేం దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లకు కూడా సోలార్ పవర్ను వాడుతున్నాం. ఇది వరకే వెయ్యి యూనిట్లను అమ్మాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50 వేల యూనిట్లను అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నాం. అమ్మకాలను పెంచడానికి ‘వీల్స్ ఆన్ షోరూం’ను, ‘సర్వీస్ ఆన్ వీల్స్’ను మొదలుపెట్టాం. మా వెబ్సైట్ ద్వారా బైక్ను బుక్ చేసుకున్న కొన్ని గంటల్లోపే డెలివరీ ఇస్తున్నాం. మా లో స్పీడ్ బైకు నాలుగు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. దీనికి లైసెన్సు, ఆర్సీ బుక్ అవసరం లేదు. ధర రూ.55 వేలు. బైకు తయారీకి కావాల్సిన 90 శాతం భాగాలను లోకల్గానే కొంటున్నాం”అని ఆయన వివరించారు.