
- ఆరోపించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ధర్మవరపు బ్రహ్మం
సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీలో అవినీతి రాజ్యామేలుతోందని పట్టణ 38 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2022లో జరిగిన తెలంగాణ సమైక్యత వజ్రత్సవాల్లో రూ.7.5 లక్షల అవినీతి జరిగిందన్నారు. సిద్దిపేట మున్సిపల్ అధికారులు వజ్రోత్సవాలకు సంబంధించిన ఖర్చు రూ. 30లక్షలు చేయించారని, వాటికి సంబంధించిన బిల్లులు కలెక్టర్ ఆఫీస్ కు అందించగా వారు రూ.22 లక్షల 50 వేలను చెక్కుల రూపంలో అందించారన్నారు.
మిగితా రూ.7లక్షల50 వేలను క్యాష్ రూపం లో అందించారని అధికారులు స్వయంగా ఆర్టీఐ ద్వారా తెలిపారన్నారు. మున్సిపల్ ఎజెండాలో కేవలం రూ.22 లక్షల50వేలు మాత్రమే చూపించారని మరి క్యాష్ రూపంలో వచ్చిన డబ్బును ఎందుకు చూపెట్టలేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ అధికారులపై సీబీఐ, విజిలెన్స్ తో సమగ్ర విచారణ జరిపించాలన్నారు.