హంబన్ టొట పోర్టుకు చేరిన చైనా నౌక యువాన్ వాంగ్

హంబన్ టొట పోర్టుకు చేరిన చైనా నౌక యువాన్ వాంగ్

చైనా స్పై షిఫ్ యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టొట పోర్టుకు చేరుకుంది. స్పై షిఫ్ పోర్టుకు చేరుకున్నట్లు హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డిసెల్వ తెలిపారు. షిప్ రాకను కనిపెట్టిన భారత్ వెంటనే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్ వాంగ్-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలన్నారు. శ్రీలంక సూచన మేరకు షిప్ రాక వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా.. గతవారం యువాన్ వాంగ్ హంబన్ టొట దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గుర్తించారు. ప్రయాణ వాయిదాపై లంక ప్రభుత్వాన్ని చైనా అధికారులు ప్రశ్నించడంతో.. వారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో శనివారం షిప్ రాకకు అనుమతి మంజూరు చేసింది.

శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఆఫ్ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు తెలిపారు కొలంబో అధికారులు. లంక జలాల్లో ఎలాంటి సర్వేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి 22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. పొరుగు దేశాలతో భద్రత, సహకారం తమ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది శ్రీలంక ప్రభుత్వం. హంబన్ టొట అభివృద్ధికి చైనా 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. శ్రీలంక రుణం చెల్లించలేకపోవడంతో ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు తీసుకుంది బీజింగ్.