
కొందరి జీవితాలు సినిమాలు పోలినట్టే ఉంటాయి. సినిమా కథలాగే నిజజీవితంలో కూడా ఉంటుంది. జాతరకు వెళ్లిన కుటుంబం.. జనాలు ఎక్కువ ఉండటంతో పిల్లలు తప్పిపోవడం.. పిల్లలు చనిపోయారంటూ తల్లిదండ్రులు బాధపడుతూ బతకడం..కట్ చేస్తే పెద్దయ్యాక అమ్మా నాన్న కంట పడి నేను మీ పిల్లవాడిని అని తిరుగొచ్చేయడం.. ఇలా ఎన్నో సినిమాల్లో చూశాం.. చూస్తున్నాం.. సేమ్ టూ సేమ్ సినిమా కథను పోలినట్టే ఓ కుటుంబంలో జరిగింది. ఇంతకు ఎక్కడంటే..
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లల్లు సీత, గీత ఇద్దరూ తమ కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసించేవారు. ఇద్దరు సోదరీమణులు జనవరి 2023లో తప్పిపోయారు.వారి సోదరుడు అజయ్ ప్రజాపతి తమ చెల్లల్లు తప్పిపోవడంతో వారి కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అజయ్ వారి గ్రామానికి చెందిన జయనాథ్ మౌర్య అనే వ్యక్తిని సంప్రదించాడు. తన చెల్లల్లు ఎక్కడ ఉన్నారో చెప్పాలని అజయ్, జయనాథ్ ను ప్రశ్నించాడు.
ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో జయనాథ్ మౌర్య పై హత్య కేసు నమోదు చేయడానికి అజయ్ పోలీసు స్టేషన్కు వెళ్లాడు. అయితే ఆధారాలు లేకపోవడంతో జయనాథ్ పై పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అజయ్ కోర్టును ఆశ్రయించాడు. చివరకు, జనవరి 2024లో కోర్టు ఆదేశాల మేరకు గోరఖ్పూర్లోని బెల్ఘాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
హత్య కేసు దర్యాప్తులో, సోదరీమణులు బతికే ఉన్నారని, ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడానికి ఇంటి నుండి పారిపోయారని పోలీసులు గుర్తించారు. జయనాథ్ పై నమోదైన హత్య కేసు గురించి తెలుసుకున్న వెంటనే, సోదరీమణులు పోలీసులను ఆశ్రయించారు ఏ అమాయకుడికి శిక్ష పడకుండా ఉండేందుకు తమ వాంగ్మూలాన్ని ఇస్తున్నామని తెలిపారు. తప్పిపోయిన వారిలో ఒకరు సీత మాట్లాడుతూ తనకు హర్యానాకు చెందిన విజేందర్తో వివాహమైందని పోలీసులకు సమాచారం అందించింది. తనకు ఐదు నెలల కుమార్తె ఉందని, చాలా సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతున్నానని ఆమె వారికి చెప్పింది.