న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ రిక్రూట్మెంట్ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి సంస్థను దారుణంగా మోసం చేశాడు. పక్కా ప్లాన్ వేసి దశాబ్ద కాలంగా ఆ కంపెనీ నుంచి కోట్లాది రూపాయలను జేబులో వేసుకున్నాడు. మ్యాన్పవర్గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో మాజీ ఫైనాన్స్ మేనేజర్ రాధావల్లభ్ నాథ్, కంపెనీ పేరోల్ విధానాన్ని తారుమారు చేశాడు. తన నిరుద్యోగ భార్యను రహస్యంగా ఉద్యోగంలో చేర్చాడు. కొన్నేళ్లపాటు రూ. 4 కోట్లకు పైగా జీతం ఇచ్చాడు. ఇందుకోసం దొంగ లెక్కలు తయారు చేశాడు. అసలు సంగతి గత ఏడాది డిసెంబర్లో బయటికి వచ్చింది. నాథ్ చేసిన పని సంస్థకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
అధికారులు ఇప్పుడు ఈ ఆర్థిక నేరంపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యకు జీతం ఎలా చెల్లించాడనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. కంపెనీలో కేవలం ముగ్గురు అధికారులకు మాత్రమే... - డైరెక్టర్ (హ్యూమన్ రిసోర్సెస్), చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, నిందితుడు నాథ్కు - మంత్లీ పేరోల్ రీయింబర్స్మెంట్ డేటాకు యాక్సెస్ ఉంటుంది. అవుట్సైడ్ పేరోల్వెండర్, ఇతర డిపార్ట్మెంట్లకు కీలకమైన లింక్ ఇతడేనని అధికారులు చెబుతున్నారు. పేరోల్ డేటాలో అతని భార్య సుస్మితా రౌల్ పేరును చేర్చి నెలానెలా జీతం జమ చేశాడు. ఇందుకోసం సంబంధిత జీతం మొత్తంతో ఎక్సెల్షీట్లో అదనపు వరుసను చేర్చాడు. అంతేగాక తన సొంత జీతాన్ని పెంచుకోవడం కొసమెరుపు.