విద్యుత్ అంతరాయాలకు చెక్!.. భద్రాచలం డివిజన్లో రూ.2కోట్లతో రెండు కొత్త సబ్ స్టేషన్లు

విద్యుత్ అంతరాయాలకు చెక్!.. భద్రాచలం డివిజన్లో రూ.2కోట్లతో రెండు కొత్త సబ్ స్టేషన్లు
  • మన్యంలో స్థలసేకరణ పూర్తి.. త్వరలో టెండర్లు
  • అందుబాటులోకి వస్తే నిరంతర విద్యుత్ సరఫరాకు లైన్ క్లియర్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం మన్యంలో విద్యుత్​ అంతరాయాలకు చెక్​పెట్టేందుకు ట్రాన్స్ కో యాక్షన్​ప్లాన్​ తయారు చేసింది. భద్రాచలం ట్రాన్స్ కో డివిజన్​ పరిధిలోని బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో కొత్తగా రెండు సబ్​ స్టేషన్లను మంజూరు చేసింది. 

ఒక్కో సబ్​ స్టేషన్​కు  రూ.2కోట్లు నిధులు కేటాయించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్థలాన్ని రెవెన్యూశాఖ సర్వే చేసి ట్రాన్స్ కోకు అప్పగించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్​లోని ఆఫీస్​కు పంపించారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ రెండు సబ్​స్టేషన్ల నిర్మాణం పూర్తయితే మారుమూల గ్రామాల్లో ఇక నిరంతర విద్యుత్​ సరఫరాకు లైన్​ క్లియర్​ అవుతుంది. 

మన్యంలో అతిపెద్ద మండలం దుమ్ముగూడెం

మన్యంలో అతిపెద్ద మండలం దుమ్ముగూడెం. చత్తీస్​గఢ్​ బార్డర్​ను ఆనుకుని గిరిజన పల్లెలు ఉన్నాయి. ప్రస్తుతం దుమ్ముగూడెం, పర్ణశాల, లచ్చిగూడెంలో ఇప్పటికే సబ్​స్టేషన్లు ఉన్నాయి. విలీన ఎటపాక మండల కేంద్రం నుంచి దుమ్ముగూడెంకు విద్యుత్​ సరఫరా అవుతోంది. ఈ మండలంలోని నర్సాపురం ఫీడర్​కు విద్యుత్​ సరఫరా జరిగి అక్కడ నుంచి పరిసర గ్రామాలకు వెళ్తోంది. అయితే మార్గం మధ్యలో తరుచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల లోపాన్ని గుర్తించి సరఫరా పునరుద్ధరణకు ట్రాన్స్ కో సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సీతారాంపురంలో కొత్తగా సబ్​స్టేషన్​ నిర్మాణం పూర్తయితే ఈ సమస్యలకు చెక్​ పడుతుంది.  సుమారు 4వేల సర్వీసులకు లబ్ధి చేకూరుతుంది. 

ప్రధానంగా వ్యవసాయానికి అవసరమైన విద్యుత్​ కూడా అందుతుంది. ఈ సబ్ స్టేషన్​ పరిధిలోనే వ్యవసాయ బోర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర నుంచి ముసలిమడుగు పరిసర గ్రామాలకు సరఫరా జరుగుతోంది. కానీ మధ్యలో అవాంతరాలు ఏర్పడి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. దీన్ని అధిగమించేందుకు ముసలిమడుగు గ్రామంలో కొత్త సబ్​స్టేషన్​ నిర్మాణం జరుగుతోంది. బూర్గంపాడు మండలంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్​ సర్వీసులు కూడా ఎక్కువే. కొత్త సబ్​స్టేషన్​ వల్ల గృహవినియోగదారులకు, రైతులకు మేలు జరుగుతుంది. 

పర్ణశాల సబ్​స్టేషన్​ తరలింపు

దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల సబ్​స్టేషన్​ ఎంతో కీలకం. కానీ చిన్నపాటి వరదలకే ఈ సబ్​స్టేషన్​కు మునుగుతోంది. గోదావరి పొంగితే పలు గ్రామాలకు కరెంట్​కట్ అవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్​ ఆదేశాలతో ఈ సబ్​స్టేషన్​ను చినబండిరేవు గ్రామానికి తరలిస్తున్నారు. పనులు కూడా పూర్తి కావొచ్చాయి. త్వరలో ఈ తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. మరోవైపు గోదావరి తీరం వెంట ఉన్న విద్యుత్​ స్తంభాలను మెరక ప్రాంతాలకు మార్చారు. 70 అడుగుల గోదావరి వరద వచ్చినా దుమ్ముగూడెం మండలానికి విద్యుత్​ను అంతరాయం లేకుండా అందించేలా ట్రాన్స్ కో పనులు పూర్తి చేసింది. మరోవైపు సాంకేతిక లోపాలను అన్వేషించేందుకు ఎఫ్​పీఐ(ఫాల్ట్ ప్యాసేజ్​ ఇండికేటర్​)లను కూడా ఏర్పాటు చేశారు. 

చింతలగూడెం, తూరుబాక, నడికుడి, ఆర్లగూడెం, బైరాగులపాడు, చిన్నబండిరేవు జంక్షన్లలో వీటిని పెట్టారు. ఎప్పుడైనా సరఫరాకు అంతరాయం ఏర్పడితే లోపం ఎక్కడుందో తెలుసుకోవాలంటే లైన్​ మొత్తం వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఎఫ్​పీఐల ఏర్పాటు వల్ల లోపం ఉన్న ప్రాంతంలో లైట్​ బ్లింక్​ అవుతూ సిబ్బందికి కనబడుతుంది. మొత్తం తిరిగే పని లేకుండా ఆ ప్రాంతంలోనే లోపాన్ని సరిచేసి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.

త్వరలో రెండు సబ్ ​స్టేషన్ల నిర్మాణాలు

భద్రాచలం డివిజన్​లోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు, దుమ్ముగూడెం మండలంలోని సీతారాంపురంలో కొత్త సబ్​స్టేషన్ల నిర్మాణం జరగనుంది. భూసేకరణ పూర్తయ్యింది. టెండర్ల దశలో ఉంది. ఇవి పూర్తయితే నాణ్యమైన, మెరుగైన విద్యుత్​ సరఫరా జరగుతుంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్​ సరఫరా చేస్తున్నాం.  జీవన్​కుమార్, డీఈ, భద్రాచలం