హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫెడరేషన్ ఆఫ్ ఆన్ కాలనీస్ అండ్ రెసిడెంట్ వెల్ఫెర్ అసోసియేషన్స్ మణికొండ సభ్యులు సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిశారు. మణికొండలోని తిరుమల హిల్స్ లో రూ. 90 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇటీవల హైడ్రా కాపాడింది. ఈ భూమికి రక్షణ కల్పించాలని సభ్యులు కోరారు. ఇప్పటికే కొంత స్థలంలో పెన్షింగ్ వేయగా, మిగిలిన 1054 చదరపు గజాలకు ఫెన్సింగ్ పూర్తి చేయాలని, అలాగే వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, అవుట్డోర్ జిమ్ వంటి పార్కు సౌకర్యాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ అంశంపై రంగనాథ్ సానుకూలంగా స్పందించారని, భూమికి ఫెన్సింగ్ వేయించడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు, ఈ భూమిని రక్షించడంలో సీఐ రాజశేఖర్ ని కూడా అభినందించామన్నారు. రంగనాథ్ ని కలిసిన వారిలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ అర్వపల్లి వంశీ, తిరుమల హిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి అవినాష్, వైస్ ప్రెసిడెంట్ భరత్ కుమార్ యాదవ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, సభ్యులు రంగాచార్యులు ఉన్నారు.
