మా కుటుంబానికి భద్రత కల్పించండి

మా కుటుంబానికి భద్రత కల్పించండి

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సమయంలో.. ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఎస్పీ లేకపోవడంతో లేఖను కార్యాలయ సిబ్బందికి అందించారు. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5.10 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, అదే సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత లేఖలో తెలిపారు. 

అతడు వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న మణికంఠ రెడ్డి అనే వ్యక్తిలాగే ఉన్నాడని ఆమె వివరించారు. ఈ విషయమై ఆగస్టు 12న సీఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని చెప్పారు. 

వివేకా హత్య జరిగిన తర్వాత డాక్టర్ సునీతారెడ్డి 15 మంది అనుమానితుల పేర్లను అధికారులకు అందించారు. వారిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు.