ఇస్లామాబాద్: పాకిస్తాన్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతుండటంతో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివాతో ఫోన్లో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితిని వివరించి.. మరో విడత సాయం విడుదల చేయాల్సిందిగా కోరారు. ఐఎంఎఫ్ చీఫ్ నుంచి ఫోన్ వచ్చినట్టు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
ఆర్థిక సాయంపై ఐఎంఎఫ్ సానుకూలంగా స్పందించిందని వివరించారు. ‘‘మా ప్రజలపై మరింత భారం మోపలేను అని ఐఎంఎఫ్ చీఫ్కు చెప్పా. ఆర్థిక సాయంపై చర్చల కోసం ఐఎంఎఫ్ ప్రతినిధి బృందాన్ని పాక్కు పంపాలని కూడా కోరా” అని షెహబాజ్ చెప్పారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో ఐఎంఎఫ్ బృందం వస్తుందని, రుణ సాయంతో పాటు ఇతర సమస్యలపైనా చర్చిస్తామని వివరించారు.