- ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్న ఆఫీసర్లు
కొల్లాపూర్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీని నడిపేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 9 గంటలకు 80 టూరిస్ట్లతో సోమశిల వద్ద ప్రారంభం కానున్న యాత్ర శ్రీశైలం వద్ద ముగుస్తుంది. సుమారు ఆరు గంటల పాటు కృష్ణా నదిలో సాగే ఈ యాత్రలో ఇరువైపులా దట్టమైన అడవి, వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు, తీరంలో మత్స్యకారుల గూడారాలు టూరిస్ట్లకు కనువిందు చేయనున్నాయి.
ఈ యాత్ర కోసం సుమారు 120 మంది టూరిస్ట్లు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ లాంచీని సిద్ధం చేసిన ఆఫీసర్లు ప్యాకేజీ వివరాలను సైతం ప్రకటించారు. సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లి.. తిరిగి సోమశిల రావడానికి.. పెద్దలకు రూ. 3000, పిల్లలకు రు. 2,400గా నిర్ణయించారు. వన్ వే టూర్ అయితే పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1,600గా ప్రకటించారు. టూరిజం శాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చని ఆఫీసర్లు చెప్పారు.
