బంగారంలో పెట్టుబడుల కోసం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్

బంగారంలో పెట్టుబడుల కోసం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్

న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడులపై ఆసక్తి ఉన్న వారికోసం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (ఎస్​జీబీ) 2021–-22  తదుపరి విడత ఇష్యూ సోమవారం నుంచి మొదలవుతోంది.  ఇది ఐదు రోజుల పాటు సబ్‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.  గ్రాము బంగారం ధరను రూ.5,197గా నిర్ణయించామని ఆర్​బీఐ తెలిపింది.   కేంద్రం తరపున ఆర్‌‌బిఐ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,  పోస్టాఫీసులు,  గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుక్కోవచ్చు. కనీసం పెట్టుబడి ఒక గ్రాము.  బాండ్ కాలపరిమితి 8 సంవత్సరాలు. కావాలనుకుంటే ఐదో సంవత్సరం తరువాత అమ్మేయవచ్చు.  ఒక్కో వ్యక్తి 4 కేజీల వరకు కొనుక్కోవచ్చు.  ట్రస్టుల వంటి సంస్థలు ఆర్థిక సంవత్సరానికి 20 కేజీల వరకు కొనొచ్చు.  కేవైసీ రూల్స్​సాధారణ బంగారం కొనుగోలుకు సంబంధించినట్లే ఉంటాయి.  ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది.  సాధారణ బంగారానికి డిమాండ్‌‌ను తగ్గించడం,  బంగారం కొనుగోలు కోసం ఉపయోగించే డబ్బులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపుగా మార్చాలనే టార్గెట్​తో ఈ పథకాన్ని 2015 నవంబర్ లో మొదలుపెట్టారు. సబ్‌‌స్క్రిప్షన్​కు ముందు వారంలోని చివరి 3 పనిదినాల్లో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ పేర్కొన్న 999 స్వచ్ఛత బంగారం  సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్ ధరను నిర్ణయిస్తారు.