
వరంగల్, వెలుగు: ఆగస్టు31 వరకు పనులు పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటివారంలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలిక స్పోర్ట్స్స్కూల్ను ప్రారంభించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీశ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆయన అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఓరుగల్లులో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ అనిపించుకునేలా తయారు చేయాలన్నారు. శాశ్వత స్కూల్ ఏర్పాటుకు హనుమకొండ జిల్లాలోని మడిపల్లి, ధర్మసాగర్ ఏరియాల్లో అనుకూల స్థలాలను గుర్తించాలన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఉనికిచర్ల వద్దనున్న 22 ఎకరాల స్థలాలు అనుకూలమని పేర్కొన్నారు. స్థలసేకరణకు అడ్డంకులను త్వరగా తొలగించాలని చెప్పారు. దేవునూర్ గుట్టలను ఎకో టూరిజం హబ్గా డెవలప్ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఎస్వో అశోక్ కుమార్, కుడా పీవో అజిత్రెడ్డి పాల్గొన్నారు.