- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ ‘ఉరి తీయాల్సింది రాహుల్ గాంధీని కాదని, మానేరు ఇసుకను పందికొక్కులా తిని రూ.వేలకోట్లు సంపాదించిన కేటీఆర్ను మానేరు ఒడ్డున ఉరితీయాలి’ అని అన్నారు. నేరెళ్ల దళిత బిడ్డలను కేటీఆర్ ఇసుక లారీలతో గుద్దించారన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుంటే చూసి ఓర్వలేక కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్, కేటీఆర్ రూ.వేలకోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని ఆ ఇంటి ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత బయట పెడుతోందని అన్నారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఉన్న శ్రీరాంనగర్ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మించబోయే యూజీడీ నిర్మాణ పనులను సుడా చైర్మన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో అసలే డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు, దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బోనాల శ్రీనివాస్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నర్సింగం, రమేశ్, తిరుమల, మల్లిఖార్జున్, లత, తదితరులు పాల్గొన్నారు.
