- సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కపాస్ కిసాన్ యాప్ను 24 గంటలు అందుబాటులో ఉంచేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శనివారం సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల ఫోన్లో మాట్లాడారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసే నిబంధనను ఎత్తివేయాలని, పాత పద్ధతిలో 12క్వింటాళ్లు విక్రయించే అవకాశం కల్పించాలని కోరారు.
జిన్నింగ్ మిల్లర్లు, రైతుల విన్నపాల మేరకు ఎల్1, ఎల్2, ఎల్3 మిల్లులను తక్షణమే ఓపెన్ చేయాలని, 20 శాతం తేమ ఉన్న 12క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిందని పేర్కొన్నారు.
పంట నష్టం సర్వే నివేదిక త్వరగా ఇవ్వాలి
మొంథా తుఫాను పంటనష్టం సర్వే నివేదికను త్వరగా సమర్పించాలని అగ్రికల్చర్అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. క్రాప్ బుకింగ్ యాప్లో పంటనష్టం ఫొటోలు అప్లోడ్ చేస్తున్నట్టు డైరెక్టర్ గోపి తెలిపారు. యాచారం ప్రాంతంలో రైతుల పంటల కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో1.5 లక్ష టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉందని, ఈ నెలలో రెండు లక్షలు, వచ్చే నెలలో మరో రెండు లక్షల టన్నుల కేటాయింపు జరుగుతుందన్నారు.
యూరియా సరఫరాను వేగవంతం చేయాలని సూచించారు. యూరియా తయారీలో ఉపయోగించే ‘అడ్ బ్లూ’ మూలకం అక్రమంగా విక్రయిస్తున్నారని గుర్తించిన మంత్రి.. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
