- మూసేయాలంటూ 305 కంపెనీలకు పీసీబీ ఆదేశాలు
- నిబంధనలను పాటించని మరో 1,234 సంస్థలకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతోంది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలను పాటించని సంస్థలను మూసివేస్తున్నది. తాజాగా నిబంధనలను ఉల్లంఘించిన 305 సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. మరో 1,234 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో పీసీబీ వెల్లడించింది. కాలుష్య తీవ్రత ఆధారంగా రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ జోన్లలో 12,264 కంపెనీలు ఉన్నాయని తెలిపింది. ‘‘2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ వరకు 2,620 కొత్త కంపెనీలకు అనుమతులిచ్చాం.
మరో 3,521 సంస్థలు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించాం. కాలుష్య నియంత్రణకు సంబంధించి వివిధ పరిశ్రమల నుంచి 7,966 వేస్ట్ వాటర్ శాంపిళ్లు, 3807 ఎయిర్ పొల్యూటెంట్ శాంపిళ్లను సేకరించాం. వాటిని ల్యాబుల్లో టెస్ట్ చేశాం. టెస్టుల్లో ఫెయిలైన శాంపిళ్లకు సంబంధించిన కంపెనీలకు నోటీసులిచ్చాం” అని పీసీబీ వివరించింది. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్నాక 697 సంస్థలకు ఇచ్చిన క్లోజర్ ఆర్డర్ను ఉపసంహరించుకున్నామని తెలిపింది. అత్యధికంగా కాలుష్యానికి కారణమవుతున్న 501 కంపెనీలపై 24 గంటల పాటు ఆన్లైన్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశామని వెల్లడించింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన 108 కంపెనీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ రివ్యూ చేసిందని, వెంటనే వాటిని సరిచేసుకోవాలని లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని కమిటీ హెచ్చరించిందని వెల్లడించింది.
వేస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ
కాలుష్య నియంత్రణకు సంబంధించి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు 10741 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేశామని పీసీబీ తెలిపింది. అంతేకాకుండా జనవాణి కాలుష్య నివారిణి అనే మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఇండస్ట్రియల్ జోన్లలో నైట్ పెట్రోలింగ్ చేస్తున్నామని తెలిపింది. బల్క్ డ్రగ్, కెమికల్ పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ను కచ్చితంగా ఏర్పాటు చేసేలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. పొల్యూషన్ను తగ్గించేలా శుద్ధిచేసిన వేస్ట్ వాటర్ను కంపెనీలు తిరిగి వాడుకునేలా చర్యలు చేపట్టామంది.
