- పాత చీరలో చుట్టి ఎక్కిన ప్యాసింజర్
- సగం దూరం పోయినంక కొక్కోరోకో అన్న కోడి
- రూ.30 టికెట్ ఇచ్చిన కండక్టర్
- మెమో ఇస్తామన్న డీఎం
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఓ కోడి పుంజుకు టికెట్ కొట్టాడు. మంగళవారం ఖని నుంచి కరీంనగర్కు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మహ్మద్ అలీ అనే ప్యాసింజర్ కోడిపుంజును పాత చీరలో చుట్టుకుని ఎక్కాడు. దీన్ని కండక్టర్ తిరుపతి గమనించలేదు. కేవలం ఆలీకి మాత్రమే కరీంనగర్ వరకు టికెట్ ఇచ్చాడు. సుల్తానాబాద్ చేరుకున్న తర్వాత కోడిపుంజు కొక్కోరోకో అని ఒర్రుడు స్టార్ట్ చేసింది. కండక్టర్ వెళ్లి చూడగా పుంజు కనిపించింది. దీంతో కోళ్లు, మేకలు, గొర్రెలు బస్సులో తీసుకువెళ్లడానికి వీలు లేదని చెప్పాడు. సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ కు రూ.30 అవుతుందని, టికెట్ తీసి అలీ చేతిలో పెట్టాడు. దీంతో అతడు టికెట్ డబ్బులు కట్టి పుంజును తీసుకువెళ్లాడు. కండక్టర్ మాట్లాడుతూ ప్రయాణికులతో పాటు ఏ జంతువును తీసుకువచ్చినా టికెట్ తీసుకుంటామన్నాడు. దీనిపై గోదావరిఖని డీఎం వెంకటేశం మాట్లాడుతూ పుంజుతో బస్సు ఎక్కేటప్పుడే గుర్తించాలని, టికెట్ తీసుకోవడం కరెక్ట్ కాదని, కండక్టర్కు మెమో ఇస్తామన్నారు.