వెలుగు బిజినెస్ డెస్క్: చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ రేట్లు, రవాణా ఖర్చులతోపాటు, సెమికండక్టర్ చిప్స్ రేట్లు భారీగా తగ్గడం వల్ల ఈసారి పండుగ సీజన్లో టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ధరలు తగ్గే ఛాన్స్ కనబడుతోంది. కొవిడ్ టైములో ఒక కంటెయినర్ కోసం పెట్టాల్సి వచ్చిన ఖర్చు గరిష్టంగా 8 వేల డాలర్లుండేది. ఇప్పుడది 850–1000 డాలర్లకు పడిపోయింది. అలాగే సెమికండక్టర్ల (చిప్స్) రేట్లయితే ఆల్టైమ్ కనిష్టానికి చేరాయి. మరోవైపు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల ధరలూ 60 నుంచి 80 శాతం దాకా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో టీవీలు, మొబైల్స్, కంప్యూటర్ల తయారీ కంపెనీలు తమకు వచ్చిన బెనిఫిట్లో కొంతయినా కస్టమర్లకు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కాలంగా టీవీలు, మొబైల్స్, కంప్యూటర్లకు గిరాకీ పెద్ద ఎక్కువగా లేదు. రాబోయే దీపావళి సహా ఇతర పండుగల టైములో రేట్లు తగ్గించడం ద్వారా డిమాండ్కు బూస్ట్ తేవడానికి తయారీ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్పర్టులు పేర్కొంటున్నారు. ఇన్పుట్స్ ఖర్చు తగ్గడం వల్ల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లు భారీగానే పెరిగే ఛాన్సు కూడా ఉందని వెల్లడిస్తున్నారు.
తగ్గుతున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల ధరలు
చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల ధరలు కొవిడ్ ముందు లెవెల్కు చేరాయని, కొన్ని కాంపోనెంట్ల రేట్లయితే అంతకంటే తక్కువకు కూడా పడిపోయాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గ్లోబల్గా డిమాండ్ తగ్గిపోవడంతోపాటు, కొన్ని దేశాలలో రెసిషన్ కూడా ఇందుకు కారణాలని డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ లాల్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్టు మాన్యుఫాక్చరింగ్ రంగంలో మన దేశంలో డిక్సన్ టెక్నాలజీస్ అతి పెద్ద కంపెనీ. రాబోయే కొన్ని నెలలపాటు ఇన్పుట్స్ రేట్లు ఇదే లెవెల్లో కొనసాగే అవకాశాలే కనపడుతున్నాయని పేర్కొన్నారు. ఏవో కొన్ని మార్పులు ఉండొచ్చని అన్నారు. సొంత ఎలక్ట్రానిక్ ప్రొడక్టులతోపాటు, చాలా కంపెనీలకు స్మార్ట్ఫోన్లు తయారు చేసే జైనా గ్రూప్ ఎండీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చిప్స్, కెమెరా మాడ్యూల్స్ సహా స్మార్ట్ఫోన్ కాంపోనెంట్ల రేట్లన్నీ దిగిపోయాయని పేర్కొన్నారు. ఫలితంగా అన్ని బ్రాండ్స్ ఇందులో కొంత బెనిఫిట్అయినా కన్జూమర్లకు ఇచ్చి, పండుగ సీజన్లో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తాయని అన్నారు. మరోవైపు డిక్సన్ టెక్నాలజీస్, హావెల్స్, బ్లూ స్టార్ వంటి లిస్టెడ్ కంపెనీలు తమ క్వార్టర్లీ ఎర్నింగ్స్ కాల్స్లో ఈ ఏడాది మార్జిన్లు పెరిగే ఛాన్స్లున్నాయని తెలిపాయి.
ఓపెన్ సెల్ రేట్ల పతనం...
గ్లోబల్గా ఓపెన్ సెల్ రేట్లు తగ్గడంతో తమ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పోర్ట్ఫోలియో సగటు అమ్మకం రేటు 2022–23 లో రూ. 11,500 కి దిగిపోయిందని, అంతకు ముందు ఏడాది అంటే 2021–22 లో ఈ సగటు అమ్మకం రేటు రూ. 16,400 గా ఉండేదని డిక్సన్ టెక్నాలజీస్ మేనేజ్మెంట్ వెల్లడించింది. టెలివిజన్ల తయారీలో ఓపెన్సెల్ చాలా ముఖ్యమైన కాంపోనెంట్. అంతేకాదు, ఇదే అత్యంత ఖరీదైన కాంపోనెంట్ కూడా. ముడి సరుకుల రేట్లు దిగొస్తుండడంతో తమ మార్జిన్లు అంతకు ముందు లెవెల్కు పెరుగుతాయనే ఆశాభావాన్ని హావెల్స్ ఇండియా చైర్మన్ అనిల్ రాయ్గుప్తా ఎనలిస్టులకు వెల్లడించారు.
చిప్ కంపెనీలకు భారీ నష్టాలు...
గ్లోబల్గా చిప్ కంపెనీలు గడచిన క్వార్టర్లో రికార్డు నష్టాలను ప్రకటించాయి. ఓవైపు డిమాండ్, మరోవైపు రేట్లూ తగ్గడం వల్లే వాటికి ఈ పరిస్థితి దాపురించింది. జనవరి–మార్చి క్వార్టర్లో ఇంటెల్ మునుపెన్నడూ లేనంత నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ సెమికండక్టర్ కంపెనీ అమ్మకాలు తగ్గడం వరసగా ఇది అయిదో క్వార్టర్. ప్రపంచంలోనే అతి పెద్ద మెమొరీ చిప్ మేకర్గా పేరొందిన శాంసంగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏకంగా 95 శాతం తగ్గిపోయింది. గత 14 ఏళ్లలో ఈ కంపెనీ ఏ క్వార్టర్లోనూ ఇంత తక్కువ ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్రకటించలేదు.
మన దేశంలోని మార్కెట్ పరిస్థితి....
కిందటేడాది పండుగ సీజన్ తర్వాత దేశంలో టీవీలు, మొబైల్స్, ఇతర అప్లయెన్సెస్ డిమాండ్ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండటంతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, టెక్ సెక్టార్లో ఉద్యోగాలు పోయిన నేపథ్యంలో అలాంటి ప్రొడక్టులను కొనడాన్ని కన్జూమర్లు వాయిదా వేసుకున్నారు. జనవరి–మార్చి 2023 క్వార్టర్లో ఇండియాలో స్మార్ట్ఫోన్ల సేల్స్ 16 శాతం, కంప్యూటర్ల అమ్మకాలు 30 శాతం పడిపోయినట్లు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ ఇండియా తన రిపోర్టులో ఇటీవలే వెల్లడించింది. తాజాగా ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టడంతో, రేట్లు కూడా కొంత తగ్గితే మళ్లీ డిమాండ్ పుంజుకుంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.