తెలుగు అకాడమీ డిపాజిట్ల గల్లంతు లో ఇద్దరు అరెస్టు

తెలుగు అకాడమీ డిపాజిట్ల గల్లంతు లో ఇద్దరు అరెస్టు

తెలుగు అకాడమీలో రూ.70 కోట్ల వరకు నిధులు గల్లంతైన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మస్తాన్ వలి, పద్మావతి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బ్యాంకు మేనేజర్లు. తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ పై అధికారులు CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తెలుగు అకాడమీకి మొత్తం 11 బ్యాంకుల్లో 34 ఖాతాలు ఉన్నాయి. అయితే పలు బ్యాంకుల్లో 330 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ డిపాజిట్‌ చేసింది. ప్రధానంగా యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిలో కెనరా బ్యాంకు చందానగర్ బ్రాంచ్ నుంచి డిపాజిట్ విత్‌డ్రా అవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే యూనియన్ బ్యాంకులోని నిధులు కూడా మాయమైనట్టు తేలడంతో అకాడమీ అప్రమత్తమైంది. నిధులు గోల్‌మాల్ చేయడంలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందని అనుమానించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్‌ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్టు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖ రాశారు. అయితే డిపాజిట్ల రద్దు వెనక ఎవరి హస్తం ఉందనే కోణంలో CCS పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది.