న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ‘ఎక్స్ బీబీ.1.16’ మరిన్ని మ్యుటేషన్లకు గురవుతోంది. దానిలోని సబ్టైప్ కు చెందిన ‘ఎక్స్ బీబీ.1.16.1’ వైరస్కు సంబంధించిన 113 కేసులు ఇప్పటివరకు దేశంలో వెలుగు చూశాయి. ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్రల్లోనే బయటపడ్డాయి. ‘ఎక్స్బీబీ’ విషయానికి వస్తే.. ఇది ఒమైక్రాన్ రకానికి చెందిన కరోనా వైరస్లో ఒక సబ్ టైప్. దేశంలో గత 15 నెలల్లో నిర్ధారణ అయిన ఒమైక్రాన్ కరోనా వేరియంట్ కేసుల్లో ఇలాంటి 400 కొత్త సబ్ టైప్వేరియంట్లను గుర్తించారు.
అయితే వీటిలో 90% కేసులకు ఎక్స్బీబీ వేరియంటే కారణమైందని వెల్లడైంది. జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను నిక్షిప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఇన్సా కాగ్’ (ఐఎన్ఎస్ఏ సీవోజీ) వెబ్ పోర్టల్లో ఇంకా ‘ఎక్స్ బీబీ.1.16.1’ అనే కొత్త కరోనా వేరియంట్వివరాలను లిస్ట్ చేయలేదు. దీనివల్ల సోకే ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేందుకు పెద్దగా ఆధారాలేంలేవు. ఇటీవల ‘ఇన్సా కాగ్’ విడుదల చేసిన బులెటిన్లో .. ‘‘ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కేసులు 38.2% ఉంటాయి”అని వెల్లడించింది. దీని బారినపడిన వారిలోనూ ఒమైక్రాన్ వేరియంట్తరహా లక్షణాలే బయటపడుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో 6,155 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కు పెరిగింది. మరో 11 మంది కరోనాతో చనిపోయారు. ప్రత్యేకించి ఢిల్లీలో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఢిల్లీలో 733 మందికి కరోనా నిర్ధారణ అయింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 మధ్యకాలంలో దేశ రాజధానిలో 3,800కుపైగా కేసులు నమోదయ్యాయి.
