నాయకత్వ మార్పు తప్పనిసరి.. సోనియాకు100 మంది నేతల లేఖ

నాయకత్వ మార్పు తప్పనిసరి.. సోనియాకు100 మంది నేతల లేఖ

ట్వీట్ చేసిన బహిష్కృత నేత సంజయ్ ఝా

న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ ఝా చాలా మంది నేతలు పార్టీ నాయకత్వంలో మార్పులు తీసుకురావాలని సోనియా గాంధీని కలిశారని చెప్పారు. పార్టీలో సంస్థాగతంగా పారదర్శక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారన్నారు. ‘పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై సుమారు 100 మంది నాయకులు (ఎంపీలతోనూ కలుపుకొని) అసంతృప్తితో ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. రాజకీయ నాయత్వంతోపాటు సీడబ్ల్యూసీ ఎన్నికల్లో పారదర్శకత తీసుకురావాలని కోరారు’ అని ఝా ట్వీట్ చేశారు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్ ఉదంతం ముగిసిన నేపథ్యంలో ఝా పైవ్యాఖ్యలు చేశారు. సచిన్‌ పైలట్‌కు మద్దతుగా నిలిచారని, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే కారణాలతో ఝాను గత నెల 14న కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఆర్టికల్ రాసినందుకు ఝాను పార్టీ అధికార ప్రతినిధిగా తొలగించారు. ఆ తర్వాత సస్పెండ్ చేశారు.