
జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి మరో బాంబ్ పెల్చారు. ఇప్పటికే పొత్తులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తమకు ఫోన్ చేశారన్న ఆయన.. ఇప్పుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 15 మంది నేతలు జేడీఎస్లో చేరతారని అన్నారు. చిత్రదుర్గ మాజీ ఎమ్మెల్యే రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, తాను జేడీఎస్లో చేరుతానని స్వయంగా చెప్పారని కుమారస్వామి అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది జేడీఎస్లో చేరుతారని ఆయన తెలిపారు.
గతంలో జేడీఎస్ను ముంచేందుకు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను తీసుకెళ్లిందని.. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జేడీఎస్లోకి ఎమ్మెల్యేలు వస్తున్నారని కుమారస్వామి అన్నారు. జేడీఎస్ రెండో జాబితాను సోమవారం విడుదల చేస్తామని ప్రకటించారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, అధికారంలోకి వచ్చేది తామేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జేడీఎస్ నేతలు ఎల్ఆర్ శివరామే, ఏటీఆర్ రామస్వామి ఇటీవలే బీజేపీలో చేరారు. మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.