- 20 లక్షల ఎకరాలకు పైగా సాగు
- లిఫ్టుల కింద మాత్రం పంటల మార్పిడి
- ఈఎన్సీతో మీటింగ్లో ఇంజనీర్ల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ వరి వద్దని చెప్పగా, ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద రైతులు ఎక్కువగా వరినే సాగు చేస్తున్నారు. యాసంగిలో ప్రాజెక్టుల కింద పంటల సాగుపై గురువారం జలసౌధ నుంచి ‘మిడ్ టర్మ్ అప్రైజల్’ మీటింగ్ నిర్వహించారు. ఈఎన్సీ (జనరల్) మురళీధర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టుల వారీగా పంటల సాగుపై సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ, నిజాంసాగర్ కింద వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 65 నుంచి 70 శాతం మంది రైతులు వరి పంటే వేశారని చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొంతమేర వరి సాగు తగ్గిందని తెలిపారు. ఎత్తిపోతల పథకాల కింద ఎక్కువగా పంటల మార్పిడి ఉందన్నారు. ఆయా ప్రాజెక్టుల కింద నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న, సజ్జలు, కూరగాయలు ఎక్కువగా సాగు చేశారని వివరించారు.
డిండి కింద క్రాప్ హాలీడే..
వరి సాగు వద్దని సూచించడంతో డిండి ప్రాజెక్టు కింద ఎక్కువ మంది రైతులు పంటలు వేయకుండా క్రాప్ హాలిడే పాటిస్తున్నారని ఇంజనీర్లు తెలిపారు. ఎక్కువ మంది రైతులు పంట మార్పిడి చేయలేదని.. ఒకట్రెండు సీజన్లు పోతే తప్ప ఆశించిన మార్పు సాధ్యం కాకపోవచ్చని అంచనా వేశారు. యాసంగి సీజన్లో మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 11.95 లక్షల ఎకరాల్లో వరి, 22.32 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు 296 టీఎంసీల నీళ్లు ఇచ్చేలా ప్లాన్ రూపొందించారు. ఈ అంచనాకు మించి 20 లక్షల ఎకరాలకు పైగా ప్రాజెక్టుల కింద వరి సాగు చేసినట్టుగా అంచనా వేశారు.