
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారంతా కుతుల్, అందాయ్ ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులని, ఇందులో కమాండర్ సుఖ్లాల్ కూడా ఉన్నారని ఎస్పీ రాబిన్ సన్ గుడియా తెలిపారు.
వీరందరిపై రూ.37 లక్షల రివార్డ్ ఉందని, వీరంతా గతంలో నారాయణ్పూర్ జిల్లాలో పలు విధ్వంసాల్లో పాల్గొన్నారని ఎస్పీ వివరించారు. దండకారణ్యంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో మావోయిస్టుల కార్యకలాపాల నిర్వహణను అడ్డంకిగా మారిందని, ఇప్పటివరకు నాలుగు వేల మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ వెల్లడించారు.