మానుకోటలో 2,688 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం..ముగ్గురు అరెస్ట్

మానుకోటలో 2,688 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం..ముగ్గురు అరెస్ట్
  • పరారీలో మరో ఇద్దరు
  • మహబూబాబాద్ ఎస్పీ సుధీర్​ రాంనాథ్

మహబూబాబాద్ అర్బన్, వెలుగు : కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్న ముఠాను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.4 లక్షల విలువైన కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సుధీర్​రాంనాథ్​కేకన్​శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మానుకోట టౌన్ జ్యోతిబసు నగర్​ కాలనీలో రాజగోపాల్​కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

శాయంపేటకు చెందిన రవీందర్​గతంలో మధ్యప్రదేశ్ లో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి వరంగల్​ ఏరియాలో అమ్మేవాడు. దీంతో అతనికి నాగపూర్​కు చెందిన ఆశిష్​ఠాకూర్ తో​ పరిచయం ఏర్పడింది. కాగా.. రవీందర్​కు బ్యాంకు లోన్లు, క్రెడిట్​కార్డుల ఇప్పించేక్రమంలో ఖమ్మంకు చెందిన సాబిర్​ పాషాతో పరిచయం ఉండగా.. ముగ్గురూ కలిసి కల్తీ మద్యం తయారు చేసి అమ్మి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. 

ఠాకూర్​ వద్ద రూ.1.50లక్షలతో  స్పిరిట్​కొనుగోలు చేసి కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. వీరితో పాటు వరంగల్​కు చెందిన ములుగు రాజు, రామ్​తేజ, గార్ల మండలం పెద్ద కిష్టాపురానికి చెందిన ఓర్సు కృష్ణ, జక్కుల రమేశ్​ముఠాగా ఏర్పడ్డారు.  జ్యోతిబసునగర్​కాలనీలో రాజగోపాల్​ గౌడౌన్ ను ఎలక్ర్టికల్​స్టోర్​కోసమని చెప్పి అద్దెకు తీసుకున్నారు.

 స్పిరిట్​లో కలర్ కెమికల్ కలిపి 2,688 లీటర్ల కల్తీ మద్యం తయారు చేశారు. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు.  ఓర్సు కృష్ణ, సాబీర్​పాషా, జక్కుల రమేశ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు, రామ్​తేజ, ఆశిష్​ ఠాకూర్​పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.