
- బురద నుంచి ఒక డెడ్బాడీ వెలికితీత.. ఐదుకు చేరిన మృతులు
- 150 మందిని కాపాడిన ఆర్మీ, విపత్తు నిర్వహణ బలగాలు
డెహ్రాడూన్: క్లౌడ్బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంలో వరద ముంచెత్తి.. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం దొరికింది. బుధవారం బురద నుంచి ఒక డెడ్బాడీని ఆర్మీ, విపత్తు నిర్వహణ బలగాలు వెలికితీశాయి. ఆ మృతదేహం 35 ఏండ్ల ఆకాశ్పన్వర్ది అని గుర్తించినట్లు ఉత్తర కాశీ డిజాస్టర్ కంట్రోల్ రూం వెల్లడించింది. దీంతో ఈ జలప్రళయంలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. మంగళవారమే 4 మృతదేహాలు దొరకగా.. 60కిపైగా మంది ఆచూకీ గల్లంతైంది. కాగా, ఇందులో 28 మంది కేరళకు చెందినవారు ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా.. మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందినవారిగా తేలింది. ఇందులోని ఒకరి బంధువు మీడియాతో మాట్లాడుతూ.. తమ పర్యాటక బృందం ఉత్తరకాశీ నుంచి ఉదయం 8.30కు గంగోత్రికి బయల్దేరినట్లు వెల్లడించారు. ఆ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయని, ఆ తర్వాత నుంచి ఆ 28 మందితో ఎలాంటి కాంటాక్ట్ లేదని తెలిపారు. హరిద్వార్కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 10 రోజుల ఉత్తరాఖండ్ ట్రిప్కు వచ్చినట్లు వెల్లడించారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
క్లౌడ్బరస్ట్ కారణంగా ఖీర్ గంగా నది ఉప్పొంగి ధరాలీ గ్రామాన్ని బురదతోకూడిన వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఆ గ్రామంలో ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. పలు ఇళ్లను బురద కప్పేసింది. కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ధరాలీ గ్రామం పూర్తిగా కొండలు, గుట్టల నడుమ ఉండటంతో ఆర్మీ, విపత్తు నిర్వహణ బలగాలు గాలింపు చేపట్టాయి. ఇప్పటివరకు మొత్తం 150 మందిని ప్రాణాలతో కాపాడాయి. ఆచూకీ లేని మరికొందరి కోసం ఇంకా సెర్చింగ్ కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు. మరోవైపు హార్షిల్ ఆర్మీ క్యాంప్ తుడిచి పెట్టుకుపోయి గల్లంతైన సైనికుల జాడకూడా తెలియలేదని తెలిపారు. గంగోత్రి జాతీయ రహదారిపై గంగ్నాని వద్ద లిమాచా నదిపై నిర్మించిన వంతెన వరదలకు కొట్టుకుపోయిందని, దీంతో ధరాలీకి వెళ్లే మార్గంలో రెస్క్యూ సిబ్బంది బృందం చిక్కుకుపోయిందని వెల్లడించారు.
సీఎం ధామికి పీఎం ఫోన్
సీఎం పుష్కర్సింగ్ ధామికి ప్రధాని మోదీ ఫోన్చేసి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంనుంచి కావాల్సిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ అధికారులతో సీఎం ధామి సమావేశమై.. సహాయక చర్యలను సమీక్షించారు. ధరాలీ, హార్షిల్లోని వరద ప్రాంతాలను హెలికాప్టర్లో పర్యటిస్తూ పరిశీలించారు. గాయపడిన సైనికులు, వరదలో తప్పిపోయిన వారి బంధువులను కలిసి, పరామర్శించారు.