ఓయూ, వెలుగు : అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆల్ మాలా స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఓయూలో 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు నిర్వహించిన రన్ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో పుట్టి భారతదేశ దశ, దిశను మార్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.
‘బోధించు, పోరాడు, సమీకరించు’ అనే నినాదాలతో ఆయన చేసిన పోరాటం వల్లే అణగారిన ప్రజలకు అనేక హక్కులు వచ్చాయన్నారు. విద్యార్థులు, యువత అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెల్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నవీన్, ఓయూ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల లింగస్వామి, సైదులు, మహేశ్, వీరస్వామి పాల్గొన్నారు.