తండ్రి చదివిన స్కూల్లో కొడుకు చదవడం... లేదా తాత చదివిన స్కూల్లో మనవడు చదవడం మామూలే. కానీ.. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 44 మంది ఒకే యూనివర్సిటీలో చదువుకుని రికార్డ్ క్రియేట్ చేశారు.
అమెరికాలో ఉంటున్న వున్స్చే ఫ్యామిలీలో దాదాపు అందరూ లుబ్బాక్లోని టెక్సాస్ టెక్ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అందుకే ఈ ఫ్యామిలీ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. వున్ స్చే ఫ్యామిలీకి చెందిన అంబర్ వున్స్చే పార్కర్ గిన్నిస్ రికార్డుల గురించి చదువుతున్నప్పుడు లూసియానాలోని వేన్ ఫ్యామిలీలో 40 మంది ఒకే యూనివర్సిటీలో చదువుకున్న రికార్డ్ ఉందని తెలుసుకున్నాడు. ఆ రికార్డ్ని బ్రేక్ చేయడానికి కావాల్సినంత మంది టెక్సాస్ టెక్ గ్రాడ్యుయేట్లు తన కుటుంబంలోనే ఉన్నారని అర్థమైంది. వెంటనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీమ్ని కలిశాడు. వాళ్లు వివరాలన్నీ చెక్ చేసి, గిన్నిస్ రికార్డ్ ఎనౌన్స్ చేశారు. 2023లో టెక్సాస్ టెక్ యూనివర్సిటీ 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫ్యామిలీకి అవార్డు కూడా ఇవ్వనున్నారు.
1953లో ఫ్రాన్సిస్ వున్ స్చే హోల్డెన్ గ్రాడ్యుయేట్ చేసినప్పటి నుంచి డిసెంబరు 2021లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఆండ్రూ సిమ్నాచెర్ వరకు మొత్తం నాలుగు తరాల వాళ్లు ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్యామిలీకి కోడళ్లు, అల్లుళ్లుగా వచ్చిన వాళ్లలో కూడా 14 మంది ఈ యూనివర్సిటీలోనే చదివారు. అంటే ఈ ఫ్యామిలీ నుంచి మొత్తం 60 మంది టెక్ యూనివర్సిటీలో చదువుకున్నారన్నమాట! ఇంకా నలుగురు ప్రస్తుతం అక్కడే చదువుతున్నారు.