వలసలు కొనసాగుతున్నా, రాబోయే కాలంలో సగం జనాభా గ్రామాల్లోనే

వలసలు కొనసాగుతున్నా, రాబోయే కాలంలో సగం జనాభా గ్రామాల్లోనే

రా ష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 2021 నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా(3 కోట్ల 80 లక్షలు)లో 60 శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు, నగరాలకు వలసలు కొనసాగుతున్నా, రాబోయే కాలంలో కూడా కనీసం సగం జనాభా గ్రామీణ ప్రాంతంలోనే ఉండబోతున్నది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో వయసుల వారీ జనాభా అంచనా మాత్రమే ఉంది. 2011 నాటి ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా వివరాలు అందుబాటులో ఉన్నాయి కానీ, మిగతా కులాల వారీ జనాభా సంఖ్య, ఇతర వివరాలు అందుబాటులో లేవు. గ్రామీణ ప్రజలు ఎక్కువగా పంటల సాగు, కూలి పని, పశు పోషణ, గృహ పరిశ్రమలు, చిన్నవ్యాపారాలు, ఇతర వృత్తులపై ఆధారపడి ఉన్నారు. ఆయా వృత్తులపై ఆధారపడిన వారి వివరాలు సమగ్రంగా అందుబాటులో లేవు.

వనరులపై చేజారుతున్న హక్కులు

గ్రామీణ సహజ వనరులంటే సాగు భూమి, చెరువులు, అడవి, కొండలు, గుట్టలు, ఉమ్మడి భూములు, ఖనిజ సంపద. ఈ సహజ వనరులపై స్థానికులకు హక్కులు ఉండాలి. కానీ వీటిపై స్థానిక ప్రజల్లో ఎక్కువ మందికి ఇప్పటికీ చట్టబద్ధ హక్కులు లేవు. ప్రభుత్వాలు గత 7 దశాబ్దాలుగా అనేక అభివృద్ధి ప్రణాళికలు వేసినా, స్థానిక ప్రజలకు వనరులపై హక్కులు దక్కక పోగా, వారికి ఉన్న కొద్దిపాటి హక్కులు కూడా వివిధ కారణాల వల్ల వారి చేతుల్లో మిగలడం లేదు. మూడు దశాబ్దాలుగా సహజ వనరులు, ముఖ్యంగా భూమి జీవనోపాధి వనరుగా కాకుండా ఆస్తిగా, మార్కెట్ సరుకుగా మారిపోతున్నది. గ్రామీణ వ్యవసాయదారులు తప్ప, సమాజంలో ఆస్తి పర వర్గాలు, ఇతర ఆదాయ వనరులు ఉన్న వాళ్లు సాగు భూములను పెద్ద ఎత్తున కొంటున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగిద్దామని భావించే గ్రామీణ పేదలు, తమకున్న కొద్దిపాటి ఆదాయంతో ఎప్పటికీ సాగు భూములు కొనుక్కోగలిగే  పరిస్థితి లేదు.

స్పెక్యులేటివ్  మార్కెట్ ధోరణి

గ్రామీణ ప్రాంత భూమి సంబంధాల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో సొంత భూమి లేని కుటుంబాల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న భూమి కూడా వివిధ కారణాల వల్ల  మరింత చిన్న కమతాలుగా మారుతున్నది. లేదా వారి చేతుల్లోంచి క్రమంగా జారిపోతున్నది. ఫలితంగా జీవనోపాధి కోసం వ్యవసాయం చేసే కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మరో వైపు భూ గరిష్ట పరిమితి చట్టంతో సంబంధం లేకుండా వందల ఎకరాల భూములను కొద్ది మంది వ్యక్తులు, చట్టంలో ఉన్న మినహాయింపులను వాడుకుని వివిధ పేర్లతో కొనుగోలు చేస్తున్నారు. ఒక వైపు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పేరుతో పెద్ద ఎత్తున మళ్లిస్తున్నారు. ఈ ధోరణి అన్ని జిల్లాల్లో మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల చుట్టూ ఎక్కువగా కనపడుతున్నది. ఫలితంగా రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మనుషుల, మొత్తంగా సమాజ సుస్థిర అభివృద్ధికి ఏ మాత్రమూ తోడ్పడని స్పెక్యులేటివ్  మార్కెట్ ధోరణి ఇది. మరో వైపు  ప్రభుత్వ వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం రైతు బంధు సాయం  అందుకుంటున్న వ్యవసాయ భూముల విస్తీర్ణం ఏటా పెరిగిపోతూ సుమారు 1,55,00,000 ఎకరాలకు చేరుకున్నది. ఇది నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మిరాకిల్ మాత్రమే. ఏ దేశం, రాష్ట్రంలోనూ కనపడని విచిత్రమిది.

ఉపాధి అవకాశాలు ఏవి?

ప్రభుత్వ రంగంలో ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ  చేయడం లేదు. ఖాళీల సంఖ్య ప్రతి నెలా పెరిగిపోతుంటుంది. కానీ సకాలంలో నోటిఫికేషన్​లు వెలువడవు. జాబ్ క్యాలండర్ కూడా లేదు. ఒక వేళ ఆన్ని పోస్టులనూ నింపినా, చదువుకున్న అందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు లభించడం కష్టం. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అని ఏ పార్టీ హామీ ఇచ్చినా అది మోసం చేయడమే.  ఈ సేవ, మీ సేవ లాంటి ఫీజు చెల్లింపు ఆధారిత సర్వీస్ సెంటర్ లతో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల పనులను ప్రైవేట్ పరం చేసిన విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. నిజంగా మరిన్ని ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగాలను(విద్య, వైద్యం, వ్యవసాయం) అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వానికి ఆసక్తి లేదు. నేటి పరిస్థితుల్లో పారిశ్రామిక,సేవా రంగాల్లో ఉపాధి కల్పనకు  కొన్ని పరిమితులు ఉన్నాయి. భారీ యాంత్రీకరణ, కృత్రిమ మేధో సంపత్తి ఆధారంగా కంప్యూటరీకరణ, ఉపాధి అవకాశాలను తగ్గించేస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడుతున్న ప్రైవేట్ సంస్థల, పరిశ్రమల  యజమానులు అతి తక్కువ కూలి రేట్లకు పనిచేసే , ఏ హక్కులూ అడగని కార్మికులనే పనిలోకి తీసుకుంటున్నారు. ఏ జిల్లాలో ఏ సంస్థ, పరిశ్రమ వచ్చినా, స్థానికులకు కాక, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి యజమానులు ఉపాధి కల్పించడానికి ఇదే కారణం.


రియల్ ​ఎస్టేట్ ​ప్లాట్లుగా భూమి

2011 జనాభా లెక్కల ప్రకారం 31,00,000 మంది సాగుదారులు ఉండగా, ఇప్పుడు రైతు బంధు లబ్ధిదారుల  గణాంకాల ప్రకారమే 63,00,000 మంది రైతులుగా నమోదై  రైతు బంధు సాయం పొందుతున్నారు. ధరణి పోర్టల్ సమస్యల వల్ల(పార్ట్ బి),  సాదా బైనామా డాక్యుమెంట్లు రెగ్యులరైజ్ కాకపోవడం వల్ల ఇంకా లక్షలాది ఎకరాల భూమి.. సాగు భూమిగా రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ భూములన్నీ రెగ్యులరైజ్ అయితే, రాష్ట్రంలో సాగు భూముల విస్తీర్ణం మరింత పెరుగుతుంది. రైతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. మామూలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక, సేవా రంగాలు విస్తరించిన కొద్దీ, వ్యవసాయంపై ఆధారపడే వాళ్ల సంఖ్య తగ్గిపోవడం సర్వ సాధారణం. కానీ మన రాష్ట్రంలో భిన్నంగా జరుగుతూ, రైతుల సంఖ్య పెరుగుతున్నది. పట్టా భూమిపై ఆధారపడి ప్రభుత్వాలు వ్యవసాయ రంగ పథకాలు రూపొందిస్తున్నందున భూ యజమానులు కుటుంబంలో ఉన్న కొద్ది పాటి భూమిని, ఇతర కుటుంబ సభ్యుల పేరుకు మార్చడం రైతుల సంఖ్య పెరగడానికి ఒక కారణమైతే,  వ్యవసాయంతో రోజు వారీ సంబంధం లేని వ్యవసాయేతర వృత్తుల వారు చిన్న, చిన్న రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ, రైతులుగా నమోదవడం మరో కారణం.

పట్టణీకరణ

గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాదిమందికి ఉపాధి కల్పించే బీడీ, చేనేత లాంటి గృహ పరిశ్రమలున్నాయి. కానీ ఈ రంగాల కార్మికులకు ఆదాయాలు అతి తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి ద్వారా కూడా కొంత మందికి ఉపాధి లభిస్తున్నది. గ్రామానికి దగ్గరలో ఉన్న నగరాలు, పట్టణాల్లో అసంఘటిత కార్మిక రంగంలో జీవనోపాధి అవకాశాలు పొందడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కానీ భవన నిర్మాణ రంగంలో వేగంగా పెరుగుతున్న యాంత్రీకరణ ఈ ఉపాధి అవకాశాలను తగ్గిస్తున్నది. రైతులను అన్నదాతలుగా కీర్తించే పాలకులు, తాము రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు, ప్రైవేట్ సంభాషణల్లో  ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి నమూనాలో గ్రామాల ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదని, అవసరం కూడా లేదని, గ్రామాల ప్రజలు, గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లాలని, పారిశ్రామిక, సేవా రంగాల్లో పనులు వెతుక్కోవాలని, అప్పుడే వారి సమస్యలు పరిష్కారమై, ఆదాయలు, జీవన ప్రమాణాలు మెరుగై, గ్రామీణ సంక్షోభం సమసి పోతుందని ప్రకటిస్తుంటారు. నిజానికి తమ ఆచరణతో, ప్రభుత్వాలు, అధికార గణం, కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఈ భావాలను నిజం చేస్తున్నాయి.  ఈ ధోరణికి మూలాలు భారత దేశంలో1991 నుంచి ప్రభుత్వాలు అమలు చేసిన  ప్రపంచ బ్యాంక్ ఎజెండాలో ఉన్నాయి. 2015 నాటికి 40 శాతం ప్రజలు మాత్రమే గ్రామాల్లో ఉండాలని, మిగిలిన వాళ్లు ఇతర రంగాల్లోకి, పట్టణీకరణ చెందాలని ఈ అభివృద్ధి నమూనా సూచించింది. ప్రపంచబ్యాంకు ఎజెండాకు దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ప్రతిఘటన ఈ పరిణామాన్ని ఆలస్యం చేసింది.
- కన్నెగంటి రవి,రైతు స్వరాజ్య వేదిక