
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. సర్గోధా జిల్లాలో ప్యాసింజర్లతో వెళుతున్న ఓ వ్యాన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు చనిపోయారు. మరో ఎనిమిది మందికి కాలిన గాయాలయ్యాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ఉన్నారు. సిలిండర్ పేలిన వెంటనే వ్యాన్ కు మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు. దాంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని వివరించారు. అందులో ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. ఘటనపై పంజాబ్ తాత్కాలిక సీఎం మొహ్సిన్ నఖ్వీ దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.