
పణజి : రన్వే మీదికి కుక్క రావడంతో ల్యాండింగ్ కావాల్సిన విమానం వెనుదిరగాల్సి వచ్చింది. సోమవారం గోవాకు వచ్చిన విస్తారా ఎయిర్లైన్స్ విమానానికి ఈ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు 100 మంది ప్రయాణికులతో విమానం గోవాకు బయల్దేరింది. దబోలిమ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన టైంలోనే రన్వేపైకి ఓ కుక్క రావడం గమనించిన ఎయిర్పోర్టు సిబ్బంది పైలట్ను అలర్ట్ చేశారు. దీంతో ఆ పైలట్ విమానాన్ని కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టించాడు.
ఈ కుక్క రన్వేను ఎంతకూ వదలకపోవడంతో.. చేసేదేంలేక పైలట్ విమానాన్ని మళ్లీ బెంగళూరుకే మళ్లించాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు. వాళ్లకు నచ్చజెప్పిన సిబ్బంది.. మళ్లీ సాయంత్రం 4.55 గంటలకు అదే విమానంలో గోవాకు తీసుకెళ్లారు. దబోలిమ్ ఎయిర్పోర్టులో ఈసారి సేఫ్గా ల్యాండ్ చేశారు.