కుటుంబాల్లో చిచ్చు పెడుతోన్న ప్రేమ

కుటుంబాల్లో చిచ్చు పెడుతోన్న ప్రేమ
  • తీవ్రంగా స్పందిస్తున్న యూత్, పేరెంట్స్​
  • హింసాత్మక చర్యలతో కుటుంబాల్లో అశాంతి ఆత్మహత్యలు.. హత్యలతో విషాదాలు
  • జైళ్లు, కేసులతో భవిష్యత్​పై ఎఫెక్ట్​

వరంగల్‍, వెలుగు:  ప్రేమ..ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. పిల్లల ప్రేమలతో పరువు పోతోందని తల్లిదండ్రులు హత్యలు చేయడం..తన ప్రేమను నిరాకరించారని యువకులు హింసకు దిగడం.. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని బలవన్మరణాలకు పాల్పడడం.. లాంటి  ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  ప్రేమ వ్యవహారాలకు సంబంధించి యువత, పెద్దలు క్షణికావేశంతో  నిర్ణయాలు తీసుకోవడంతో.. సొంతవాళ్లను కోల్పోయి..ఉన్నవాళ్లు జైళ్లపాలై అనేక కుటుంబాల్లో అంతులేని విషాదం నిండుతోంది.  

ప్రేమలు...దాడులు ..కిడ్నాప్​లు

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో డిసెంబర్‍ 9న ఓ యువకుడు ప్రేమించానంటూ యువతి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్​ చేశాడు. ఈ వ్యవహారంలో యువతి కుటుంబం వీధిన పడగా..బిజినెస్​మాన్ గా ఎదుగుతున్న యువకుడు జైలు పాలయ్యాడు. దాడితో అతనికి సహకరించిన దోస్తులు కేసుల్లో ఇరుక్కున్నారు. తాను ప్రేమించిన​అమ్మాయి నిశ్చితార్ధాన్ని ఆపేందుకు నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన నవీన్‍ రెడ్డి 50 మంది తన అనుచరులు, మిత్రులతో కలిసి యువతి ఇంటిమీద దాడి చేశాడు. కార్లను, ఇంట్లో ఫర్నిచర్​ను ధ్వంసం చేసి యువతిని కిడ్నాప్​చేశాడు. ఆవేశం తగ్గిన తర్వాత తాను పట్టుబడడం తప్పదని గ్రహించి యువతిని వదిలేసి పారిపోయాడు. పోలీసులకు చిక్కి ఇప్పుడు జైళ్లో ఉన్నాడు. అలాగే నల్గొండ జిల్లా నకిరేకల్‍ బొడ్రాయి బజార్​కు చెందిన  నవదీప్‍, శాలిగౌరారం మండలం ఉట్కూరుకు చెందిన కావ్య ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించలేదని చెరువుగట్టులో పెండ్లి చేసుకున్నారు. పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలను  పిలిచి కౌన్సిలింగ్‍ ఇచ్చారు. నవదీప్‍ పేరేంట్స్​పెండ్లిని అంగీకరించి జంటను ఇంటికి తీసుకెళ్లారు.అయితే కావ్య పేరేంట్స్​వెంకన్న, రేణుక వారి బంధువులు మరో 40 మంది  డిసెంబర్‍ 30న నవదీప్‍ ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన వారిని కొట్టి కావ్యను కిడ్నాప్‍ చేశారు. ఇక కరీంనగర్‍ జిల్లా హుజూరాబాద్‍ మండలం ఇందిరానగర్‍కు చెందిన వరికిల్ల రాజశేఖర్‍ అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించి వేములవాడలో పెండ్లి చేసుకున్నాడు. హుజూరాబాద్‍ పోలీసులను ఆశ్రయించగా.. కౌన్సిలింగ్‍ ఇస్తుండగానే యువతి బంధువులు రాజశేఖర్‍ ఇంటిని పెట్రోల్‍ పోసి కాలవెట్టారు. హైదరాబాద్‍ హఫీజ్‍పేటలోని ఆదిత్యనగర్‍లో ఉండే వైభవి మీద డిసెంబర్‍13న సందీప్‍ దాడి చేశాడు. వేరేవారిని పెండ్లి చేసుకుంటే ఊరుకునేది లేదంటూ వైభవి మీద, ఆమె తల్లి శోభను కత్తితో పొడిచాడు. ఆపై గొంతు కోసుకున్నాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని కడిపికొండలోనూ ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని సివ్వి శ్రీనివాస్‍ (33) జనవరి 3న కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని వరంగల్‍ ఎంజీఎంలో చేర్చారు.  శ్రీనివాస్‍ను స్థానికులు, బంధువులు చితకబాదారు.  

ప్రేమలు..చావులు.. 

జనగామ జిల్లా వెంకిర్యాలకు చెందిన ఇరుగు అరవింద్‍ వడ్లకొండ గ్రామానికి చెందిన కావేరి ప్రేమించుకున్నారు. వీరి పెండ్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో డిసెంబర్‍ 25న కావేరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటిముందు కావేరి చుట్టాలు ఆందోళన చేయడంలో మనస్తాపానికి గురైన అరవింద్ ​మర్నాడు పురుగుల మందు తాగాడు. అతన్ని  హైదరాబాద్‍ తరలించగా ట్రీట్‍మెంట్‍ తీసుకుంటూ జనవరి 3న చనిపోయాడు.  మెదక్‍ జిల్లా మనోహరాబాద్‍ మండలం ధర్మరాజుపల్లికి చెందిన తేజశ్రీ , అదే గ్రామానికి చెందిన యశ్వంత్‍రెడ్డి అక్టోబర్‍19న ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. తూప్రాన్‍లో కిరాయి ఇంట్లో కాపురానికి దిగిన మర్నాడే యశ్వంత్‍రెడ్డి తేజశ్రీని వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి తేజశ్రీ అత్తవారింటిచుట్టూ తిరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో నవంబర్‍18న పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ జనవరి 3న చనిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన తాళ్ల పూజిత శంషాబాద్​లో  ప్రైవేట్‍ జాబ్‍ చేస్తూ..సివిల్స్​కు ప్రిపేరవుతుండేది. డాక్టర్‍ మహ్మద్‍ అలీ సుతర్‍ తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పూజితతో ప్రేమ వ్యవహారం నడిపాడు. విషయం తెలుసుకున్న పూజిత తాను మోసపోయానని డిసెంబర్‍ 26న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

బిడ్డ చావుకు కారణమయ్యాడని.. 

తన కూతురిని  ప్రేమించి..ఆమె చావుకు కారణమయ్యాడని గుండపు రాజు (23)ను డిసెంబర్​10న హనుమకొండ జిల్లా కమలాపూర్‍ మండలం మాదన్నపేటకు చెందిన కనుకుంట్ల లేలెందర్‍ మర్డర్‍ చేశాడు. లేలెందర్‍ కూతురు అక్షయ (15)ను రాజు బైక్‍పై సిటీలో తిప్పాడు. మాదన్నపేట శివారులో  ఇద్దరు కూల్‍డ్రింక్‍ తాగారు. గ్రామానికి రాగానే ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో  అక్షయ చనిపోగా.. రాజు బతికి బయటపడ్డాడు. రాజు కావాలనే  ప్రేమ పేరుతో తమ కూతురును ఏదో చేశాడని అనుమానంతో చంపేశాడు.