ముంబై: మార్కెట్లను వరుస నష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. కీలక ఇండెక్స్లు శుక్రవారం కూడా భారీగా నష్టపోయాయి. పొద్దున్నే నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఐటీ మినహా అన్ని రంగాలలో అమ్మకాల ఒత్తిడి వల్ల సూచీలు నేల చూపులు చూశాయి. కరోనావైరస్, ఓమిక్రాన్ వేరియంట్ గురించి భయాలకుతోడు, ఇన్ఫ్లేషన్ పెరగడం, గ్లోబల్ సంకేతాలు నెగెటివ్గా ఉండటంతో భారీ నష్టాలు తప్పలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 950 పాయింట్లు తగ్గి 57వేల మార్కు దిగువన ట్రేడ్ కాగా, నిఫ్టీ 50 ఇండెక్స్ దాని ముఖ్యమైన సైకలాజికల్ లెవెల్17వేల దిగువకు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 889 పాయింట్లు పతనమై 57,012 వద్ద, నిఫ్టీ 263 పాయింట్లు పడిపోయి 16,985 వద్ద ముగిసింది. గ్లోబల్ ఎకానమీని కరోనా దెబ్బతీసిన తరువాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదటిసారి వడ్డీ రేట్లను పెంచింది. ఇట్లాంటి నిర్ణయం తీసుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి ప్రధాన కేంద్ర బ్యాంకుగా నిలిచింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కూడా ఇన్ఫ్లేషన్పై ఆందోళన ప్రకటించింది. దీంతో యూరోపియన్ స్టాక్లు పడిపోయాయి. ఆసియా షేర్లు సంవత్సరం కనిష్టస్థాయికి దగ్గరగా ముగిశాయి. టెక్ స్టాక్లలో భారీ పతనాన్ని గమనిస్తే వాల్ స్ట్రీట్ బలహీనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోస్టాక్స్ 0.48 శాతం తగ్గింది. జర్మనీ డాక్స్ 0.48 శాతం పడిపోయింది. అయితే బ్రిటన్ ‘ఎఫ్టీఎస్ఈ 100’.. 0.1 శాతం ఎగిసింది. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇండియాలోనూ ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బకొట్టింది. తాజాగా 85 కేసులు వెలుగుచూడటమే ఇందుకు కారణం. ఢిల్లీలో పది కొత్త ఒమిక్రాన్ కేసులు రిజిస్టరయ్యాయి. భారతదేశం అంతటా ఇప్పటివరకు 100కు పైగా కేసులు వచ్చాయి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని కేంద్రం సూచించింది.
15 సెక్టార్ గేజ్లకు లాసులు..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్ల గేజ్ మినహా మొత్తం 15 సెక్టార్ గేజ్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడి తారస్థాయికి వెళ్లింది. నిఫ్టీ మీడియా, రియాల్టీ సూచీలు టాప్ సెక్టోరల్ లూజర్స్గా మారాయి. ఒక్కొక్కటి 4 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ పిఎస్యు బ్యాంక్, కన్జూమర్ డ్యూరబుల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు కూడా 2-–3.65 శాతం మధ్య పడిపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు ఒక్కొక్కటి 2 శాతానికి పైగా నష్టపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ నిఫ్టీ లూజర్గా నిలిచింది. ఈ స్టాక్ 4.61 శాతం పడిపోయి రూ. 885 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, ఓఎన్జిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, టైటాన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి, అదానీ పోర్ట్స్, సిప్లా కూడా 3–4.4 శాతం వరకు పడిపోయాయి. అయితే, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ సన్ ఫార్మా భాగా లాభపడ్డాయి. ఇదిలా ఉంటే, రేట్గెయిన్ ట్రావెల్ ఐపీఓ నిరాశమిగిల్చింది. దీనిషేర్లు 19.88 శాతం నష్టపోయాయి. కొన్ని షేర్లు 10 శాతానికిపైగా నష్టపోయాయి. వీటిలో ఆర్ఎంసీ స్విచ్గేర్స్ (11.54 శాతం), సీఎంఐ ఎఫ్పీఈ (10.28 శాతం), నిట్కో (10 శాతం) ఉన్నాయి.
రూ. 4.65 లక్షల కోట్లు ఆవిరి
ఒమిక్రాన్ భయాలతో మార్కెట్లు పతనమవడంతో ఇన్వెస్టర్లు రూ. 4.65 లక్షల కోట్ల సంపద పోగొట్టుకున్నారు. గ్లోబల్ట్రెండ్స్ వీక్గా ఉండటంతోపాటు, ఎఫ్ఐఐలు భారీగా అమ్మకాలకు పాల్పడటంతో మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.65 లక్షల కోట్లు తగ్గి రూ. 2,59,37,278 కోట్లకు చేరింది. ఒమిక్రాన్ ఆందోళనలతో గ్లోబల్ మార్కెట్లు నెగటివ్గా ఉండటంతోపాటు, ఎఫ్ఐఐలు తెగనమ్మడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయని ట్రేడింగో ఫౌండర్ పార్థ్ న్యాతి చెప్పారు.
రేట్గెయిన్.. లిస్టింగ్ మాత్రం లాస్
రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం 15 శాతం డిస్కౌంట్కి లిస్టయి, ఆ తర్వాత మరో 5 శాతం నష్టంతో ముగిశాయి . ఈ కంపెనీ ఐపీఓలో షేర్ధరను రూ. 425 గా నిర్ణయించిన విషయం తెలిసిందే. రేట్గెయిన్ షేర్లు బీఎస్ఈలో రూ. 364.80 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో రూ. 334.10 కి పడినా చివర్లో కొద్దిగా కోలుకుని రూ. 340.50 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలోనైతే రూ. 360 వద్ద లిస్టయి, 20.57 శాతం నష్టంతో రూ. 337.55 వద్ద రేట్గెయిన్ షేర్లు క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 3,635.11 కోట్లు. ఈ నెలలోనే ఐపీఓకి రాగా, రేట్గెయిన్ టెక్నాలజీ ఇష్యూకి 17.41 రెట్లు ఎక్కువగా సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 1,335.73 కోట్లు సమీకరించింది.