గెట్టు పంచాయితీ ప్రాణాలు తీసింది దంపతుల దారుణ హత్య

గెట్టు పంచాయితీ ప్రాణాలు తీసింది దంపతుల దారుణ హత్య

ఆసిఫాబాద్, వెలుగు: అన్నదమ్ముల మధ్య భూమికి సంబంధించి చిన్న గెట్టు గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమానలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఎస్ఐ సాగర్ కథనం ప్రకారం..డెంగ్రె దస్రు, డెంగ్రె పత్రు అన్నదమ్ములు. వీరికి ఖమాన శివారులో వ్యవసాయ భూమి ఉంది. కొంత కాలం కింద ఈ భూములను పంచుకోగా తేడాలు వచ్చి గొడవ పడ్డారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. గురువారం దస్రు (52), ఇతడి భార్య బైనాబాయి (47), కూతురు సవిత చేనులో పత్తి తీస్తున్నారు. 

ఇంతలో పత్రు, ఇతడి కొడుకులు తిరుపతి, సాయి, కూతురు బయ్యా వచ్చారు. గెట్టు విషయంలో దస్రు, బైనాబాయితో గొడవకు దిగారు. విచక్షణ కోల్పోయిన పత్రు కుటుంబీకులు ఇద్దరిపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఘటన తర్వాత నిందితులు నేరుగా వెళ్లి వాంకిడి పీఎస్​లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సాగర్ పరిశీలించారు. మృతుడి కూతురు సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.